ఉత్కంఠకు తెర.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన!

పొత్తులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-03-30 08:46 GMT

ఎట్టకేలకు జనసేన పార్టీ ఉత్కంఠకు తెరదించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరికే సీటును ఖరారు చేసింది. 2019 ఎన్నికల్లో బాలశౌరి మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున గెలుపొందారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

పొత్తులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాకినాడకు టీ టైమ్‌ అధినేత ఉదయ్‌ శ్రీనివాస్‌ ను అభ్యర్థిగా పవన్‌ ప్రకటించారు. ఇప్పుడు బందరు స్థానానికి కూడా అభ్యర్థిగా బాలశౌరిని ప్రకటించడంతో జనసేన పార్టీ పోటీ చేసే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది.

కాగా ముందు నుంచి మచిలీపట్నానికి బాలశౌరి పేరే వినిపిస్తూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం బండారు నరసింహారావు పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం ఆయన గ్రీన్‌ కో కంపెనీలో ముఖ్య బాధ్యతల్లో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు బీజేపీ అగ్ర నేతలకు సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో బందరు ఎంపీ సీటును పవన్‌ కళ్యాణ్‌ ఆయనకు ఇస్తారని టాక్‌ నడిచింది. అయితే అనేక తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు బాలశౌరిని అభ్యర్థిగా ప్రకటించారు.

Read more!

గత ఎన్నికల్లో బాలశౌరి బందరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణపై విజయం సాధించారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కు సన్నిహితుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వల్లభనేని బాలశౌరి 2004లో తొలిసారి గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఇక 2009లో ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిపై కేవలం 1607 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాలశౌరి తరఫున నాడు ఎన్నికల్లో అరంగేట్రం చేసిన వైఎస్సార్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌ ప్రచారం చేయడం విశేషం.

ఇక 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. బాలశౌరిపై టీడీపీకి చెందిన గల్లా జయదేవ్‌ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బాలశౌరి బందరు నుంచి బరిలోకి దిగి వైసీపీ తరఫున విజయం సాధించారు.

వల్లభనేని బాలశౌరి కాపు సామాజికవర్గానికి చెందినవారు. తన పొలిటికల్‌ కెరీర్‌ లో నాలుగుసార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఏకైక నేత కూడా బాలశౌరే కావడం గమనార్హం. మొత్తం మీద నాలుగుసార్లు (రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ) పోటీ చేసిన బాలశౌరి రెండుసార్లు గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందగా, మరోసారి వైసీపీ తరఫున విజయం సాధించారు.

4

ప్రస్తుతం బందరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నానికి, వల్లభనేని బాలశౌరికి మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. స్థానిక ఎంపీగా బాలశౌరి పర్యటనను పేర్ని నాని వర్గీయులు పలుమార్లు అడ్డుకున్నారు. అలాగే బందరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అవనిగడ్డలోనూ స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి చంద్రశేఖర్‌ కు, బాలశౌరికి మధ్య విభేధాలు ఉన్నాయి. అవనిగడ్డలో సైతం ఎమ్మెల్యే వర్గీయులు బాలశౌరి పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై బాలశౌరి సీఎం వైఎస్‌ జగన్‌ కు ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తితోనే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి.

Tags:    

Similar News