ధర్మాన సీనియారిటీని వైసీపీ గుర్తించడం లేదా ?

ఉత్తరాంధ్రాలో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నది తెలిసిందే. ఉత్తరాంధ్రాలో ప్రస్తుతం చురుకుగా ఉన్న వారిలో రాజకీయంగా అత్యంత సీనియర్ నేత.

Update: 2026-08-30 04:30 GMT

ఉత్తరాంధ్రాలో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నది తెలిసిందే. ఉత్తరాంధ్రాలో ప్రస్తుతం చురుకుగా ఉన్న వారిలో రాజకీయంగా అత్యంత సీనియర్ నేత. ఆయన కేవలం 30 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారు. 1989లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన సుదీర్ఘమైన కెరీర్ లో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో నరసన్నపేట నుండి రెండుసార్లు శ్రీకాకుళం నుండి మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలలో ఆయన రెవెన్యూ, రోడ్లు-భవనాలు, మున్సిపల్ పరిపాలన వంటి అత్యంత కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఉత్తరాంధ్రా ప్రాంతంలో పార్టీ వ్యూహాలను రచించడంలో బలమైన క్యాడర్‌ను నిర్మించడంలో ఆయనకు మంచి పేరుంది.

బొత్స కంటే కూడా సీనియర్ :

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కంటే ధర్మాన సీనియర్ గా ఉన్నారు. బొత్స 1999లో ఎంపీగా గెలిచారు. అంతకు పదేళ్ళ ముందే ధర్మాన అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో బొత్స మంత్రి అయ్యారు. దాని కంటే పదిహేనేళ్ల ముందే ధర్మాన మినిస్టర్ పదవిని నిర్వహించారని ఆయన వర్గీయులు గుర్తు చేస్తారు. ఇక బొత్స మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ధర్మాన అయిదు సార్లు గెలిచారు అని కూడా అంటారు. ఇద్దరూ బీసీ నేతలే. ఇద్దరికీ సామాజిక వర్గాలలో మంచి పలుకుబడి ఉంది. ఇక బొత్స వర్సెస్ ధర్మాన అన్నది కాంగ్రెస్ లోనే ఉందని అంటారు. కాంగ్రెస్ లో కూడా బొత్స విజయనగరం జిల్లా మంత్రిగా ఉంటే ధర్మాన శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. బొత్స శ్రీకాకుళం జిల్లా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని నాడు ధర్మాన వర్గం గుస్సా అయ్యేదని చెబుతారు. ఇక వైసీపీలో కూడా ఇద్దరూ పక్క జిల్లాలలో ఉన్నారు, అయితే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందని అంటున్నారు.

కుమారుడి వ్యాఖ్యలతో :

ఇదిలా ఉంటే రాజకీయంగా చురుకుగా ఉంటున్న ధర్మాన కుమారుడు రాం మనోహర్ నాయుడు తాజాగా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ప్రసాదరావు అని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ తమకు ఇతర జిల్లాల నుంచి వచ్చే నాయకుల పెత్తనం అక్కరలేదని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి తల వారు దువ్వుకుంటే పాపిట కరెక్ట్ గా ఉంటుందని వేరే వారు దువ్వాలని చూస్తే వంకర టింకరగా ఉంటుందని రాం మనోహర్ నాయుడు పరోక్షంగా చేసిన ఈ కామెంట్స్ బొత్స గురించే అని అంటున్నారు. ఆయన మరో మాట అన్నారు. 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన సత్తా ధర్మాన ప్రసాదరావుది అని కూడా చెప్పారు. అంటే తమ జిల్లాలో బొత్స జోక్యం వద్దు అని ఇండైరెక్ట్ గానే చెప్పేశారు అని అంటున్నారు.

పట్టు గట్టిగానే :

అయితే బొత్స పీసీసీ చీఫ్ గా చేయడంతో ఆయనకు ఏపీలో అన్ని జిల్లాలతో బంధం ఉంది. ప్రత్యేకించి పక్క జిల్లా శ్రీకాకుళంలో పట్టు ఉంది. అక్కడ ఆయన సొంత సామాజిక వర్గం బలంగా కొన్ని నియోజకవర్గాలలో ఉంది. అలాగే ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా ఆయనను సంప్రదిస్తూంటారు. రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు విజయనగరం లోక్ సభలో ఉండడంతో పాటు పార్వతీపురం మన్యంలో పాలకొండ చేరడం వల్ల కూడా విజయనగరం జిల్లా నుంచి బొత్స శ్రీకాకుళం మీద ఫోకస్ పెట్టడానికి కారణం అయింది అని అంటున్నారు. అయితే ధర్మానను ఆయన సీనియారిటీని వైసీపీ అధినాయకత్వం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అన్న అసంతృప్తి కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రా వైసీపీ నాయకుడు ఎవరు అంటే పెద్ద రచ్చగానే అయ్యేట్లుంది అని అంటున్నారు.

Tags:    

Similar News