జ‌నసేన లక్ష్యం 100% స్ట్ర‌యిక్ రేట్‌.. !

కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ స‌హా.. కీ రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ కీల‌క ల‌క్ష్యం నిర్దేశించుకుంది.

Update: 2026-08-30 03:15 GMT

కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ స‌హా.. కీ రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ కీల‌క ల‌క్ష్యం నిర్దేశించుకుంది. 2024లో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందో.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా అదే ఫ‌లితాన్ని ద‌క్కించుకో వాల‌ని నిర్ణ‌యించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 21 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. అయిన‌ప్ప‌టికీ.. ఆ 21 స్థానాల‌ను ద‌క్కించుకుని.. వైసీపీని ఓడించింది. అలానే.. రెండు పార్ల‌మెంటు స్థానాల్లోనే పోటీ చేసినా.. ఆ రెండు స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. త‌ద్వారా 100 శాతం స్ట్ర‌యిక్ రేట్‌ను సాధించింది.

ఇక‌, ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లోనూ ఇదే ల‌క్ష్యం, ఇదే మంత్రంతో ముందుకు సాగాల‌ని పార్టీ నాయ‌కుల‌కు అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్దేశించారు. ఈ విష‌యాన్ని క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు నేత‌లు చేర‌వేస్తున్నారు. ఎంత మంది ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తార‌న్న‌ది పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్దేశిస్తార‌ని తెలిపారు. అయితే .. ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. `గెలుపు` అనేదే ల‌క్ష్యంగా ఉండాల‌ని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను ప్రిపేర్ చేసుకోవాల‌న్నారు.

ఇదేస‌మ‌యంలో పార్టీ ప‌రంగా కూడా మూడు కీల‌క అంశాల‌ను దిశానిర్దేశం చేశారు. 1) క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం. త‌ద్వారా పార్టీపై మ‌రింత మంచి అభిప్రాయం ఏర్ప‌డేలా చేయ‌డం. దీని ద్వారా ఓటుబ్యాంకును గ‌ణనీయంగా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు దిశానిర్దేశం చేశారు. 2) ఆశావ‌హులకు అవ‌కాశం: గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన‌, ఓడిన వారిని స‌మీక‌రించి.. వారికి ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తారు. త‌ద్వారా వారికి అవ‌కాశం ఇస్తే.. గెలిపించే బాధ్య‌త‌ల‌ను అంద‌రూ పంచుకోవాలి.

ఇక‌, మూడో కీల‌క‌మైన మంత్రం.. క‌లివిడి. ఇటు కూట‌మి పార్టీల‌తోనూ.. అటు సొంత నేత‌ల‌తోనూ క‌లివ‌డిగా ముందుకు సాగాల‌న్న‌దే జ‌న‌సేన ప్ర‌తిపాదించిన కీల‌క మంత్రం. ఈ దిశ‌గా అడుగులు వేయ‌డం ద్వారా.. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డం ద్వారా స్థానిక ఎన్నిక‌ల్లో కూడా.. 2024 ఎన్నిక‌ల నాటి మంత్రాన్ని పాటించాల‌ని సూచిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. 100 శాతం స్ట్ర‌యిక్ రేట్ ఖ‌చ్చితంగా వ‌చ్చేలా చూడాల‌న్న‌ది జ‌న‌సేన ప‌ట్టుద‌లగా ఉంది. త‌ద్వారా.. జ‌న‌సేన స‌త్తా ను మ‌రోసారి చాటాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Tags:    

Similar News