ఎమ్మెల్యేల‌కు చిక్కులు:.. నెక్ట్స్ టైమ్ మాటేంటి..?

తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో చింత క‌నిపిస్తోంది. ఫ‌స్ట్ టైమ్ ఓకే.. మ‌రి నెక్ట్స్‌టైమ్ ఏంటి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

Update: 2026-08-30 02:45 GMT

తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో చింత క‌నిపిస్తోంది. ఫ‌స్ట్ టైమ్ ఓకే.. మ‌రి నెక్ట్స్‌టైమ్ ఏంటి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్ర‌శ్న‌.. ఇటు టీడీపీలోను.. అటు బీజేపీలోని కొంద‌రు ఎమ్మెల్యేల్లోనూ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎక్కువ మంది నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌ల‌కు దూరంగా ఉండ‌డం కార‌ణ‌మైతే.. మ‌రో కీల‌క అంశం.. కుటుంబ రాజ‌కీయాలు. ఆయా ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యులు చేస్తున్న రాజ‌కీయాలు కూడా ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారుతున్నాయి.

జిల్లాల వారీగా చూస్తే..

గుంటూరు: ఈ జిల్లాలో ఇద్దరు కీల‌క టీడీపీ ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యుల జోక్యం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీ అధిష్టానం కూడా రెండు సార్లు హెచ్చ‌రించింది. అయినా తీరు మార‌డం లేదు. నిజానికి ఎమ్మెల్యేలుగా ప‌నితీరు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కుటుంబ స‌భ్యుల జోక్యాన్ని నివారించ‌క‌పోతే.. ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయిపోతార‌న్న విష‌యాన్ని నాయ‌కులు గుర్తించాలి.

అనంత‌పురం: ఇక్క‌డ నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న యువ నేత‌ల‌కు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వీరిలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు రెడ్డి నాయ‌కుడి పేరు వినిపిస్తోంది. వీరి ప‌రిస్థితి కూడా కుటుంబ రాజ‌కీయాల‌కు భిన్నంగా ఏమీ లేదు. కుటుంబ స‌భ్యుల జోక్యంతోపాటు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ లేని ప‌రిస్థితి కూడా ఈ ఎమ్మెల్యేల‌కు నెక్ట్స్ టైమ్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లే ప‌రిస్థితి పొంచి ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతు న్నారు.

క‌డ‌ప‌: కీల‌క‌మైన క‌డ‌ప జిల్లాలో టీడీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కొత్త‌గా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, వారి ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే..దూకుడు, లేక‌పోతే సైలెంట్ అనే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆ దూకుడు కూడా సొంత పార్టీ నేత‌ల‌పైనే ఉంటోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిని త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ఇక‌, ఫైర్‌బ్రాండ్ పేరుతో సొంత వారిపైనే కేసులు పెడుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఓ ఎమ్మెల్యేపై ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

చిత్తూరు: ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త‌గా ఎన్నిక‌య్యారు. అయితే.. వారి ప‌రిస్థితి 50 ఫిఫ్టీగా ఉంద‌ని టాక్‌. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నా.. పార్టీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను వారు.. ప‌రిష్క‌రించ‌లేక పోతున్నారు. మ‌రోవైపు.. సీనియ‌ర్లు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలా.. రాష్ట్రంలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యేలు.. నెక్ట్స్ టైం పై బెంగ‌పెట్టుకున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News