ఆ ఒక్క నిర్ణయం.. లోకల్ పోరు మొత్తం రివర్స్... ?
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఎమ్మెల్యేలు కీలకమైన ప్రతిపాదన చేశారు.
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఎమ్మెల్యేలు కీలకమైన ప్రతిపాదన చేశారు. తాజాగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదనను చాలా మంది ఎమ్మెల్యేలు ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. ప్రభుత్వం పరంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికివందనం వంటి పథకాలు స్థానికంలో బాగా ప్రయోజనం చేకూర్చనున్నాయని తెలిపారు. అయితే.. ఇదే సమయంలో మరికొన్ని అంశాలను కూడా వారు ప్రస్తావించారు.
1) నియోజకవర్గాలకు నిధులు: నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తమ స్థానిక ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకునేందుకు.. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు దోహద పడతా యని తెలిపారు. నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున కేటాయిస్తే చాలని కూడా చెప్పారు. దీనిపై ఆలోచన చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు.
2) పింఛన్లు: ప్రతినియోజకవర్గంలోనూ వేలాదిమంది కొత్త పింఛను దారులు ఎదురు చూస్తున్నట్టు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఐదేళ్ల కిందట టీడీపీ హయాంలోనే కొత్తవి ఇచ్చామని.. కానీ.. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వారు.. కొంత్త పించన్ల కోసంఎదురు చూస్తున్నట్టు తెలిపారు. అలాగే తమ నియోజకవర్గంలో ఒంటరి మహిళలు, వితంతువులు కూడా పింఛన్ల కోసం వేచి చూస్తున్నట్టు మరికొందరు చెప్పారు. ఈ క్రమంలో సుమారు 3 నుంచి 4 వేల మంది కి కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు.
3) నియోజకవర్గాల్లో క్లస్టర ఉపాధి కేంద్రాలు: దీనిని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. నియోజకవర్గాల్లో క్లస్టర్ ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతలో పెరుగుతున్న ఉపాధి ఆందోళనను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దీనిపై కూడా దృష్టి పెడుతున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు. మొత్తంగా వీటిలో ఏ ఒక్కటి ఆమోదించి.. ప్రభుత్వం పరంగా అమలు చేసినా.. స్థానికంగా ఏకపక్ష విజయం దక్కిం చుకోవచ్చని నాయకులు స్పష్టం చేశారు.