అరుణాచల్ ప్రదేశ్ కు దగ్గర్లో చైనా భారీ అణ్వస్త్ర ప్రాజెక్టు
అమెరికాలోని అగ్ర మీడియా సంస్థల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ తాజాగా ఒక సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది.;
అమెరికాలోని అగ్ర మీడియా సంస్థల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ తాజాగా ఒక సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. చైనా చేపట్టిన అత్యంత రహస్యమైన న్యూక్లియర్ ప్రాజెక్టు వివరాల్ని బయటపెట్టింది. భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ కు 800కి.మీ. దూరంలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఈ అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసినట్లుగా వెల్లడించింది.2030 నాటికి కనీసం వెయ్యికి పైగా అణు వార్ హెడ్ల సామర్థ్యాన్ని సొంతం చేసుకోవటమే చైనా లక్ష్యంగా సదరు మీడియా సంస్థ తన నిఘా కథనంలో పేర్కొంది. తమ వాదనకు బలాన్ని చేకూరేలా శాటిలైట్ పిక్చర్స్ ను పోలుస్తూ ఈ వివరాల్ని వెల్లడించింది.
అగ్రరాజ్యం అమెరికా, సోవియెట్ యూనియన్ కు ధీటుగా అణ్వాయుధాల విషయంలో ఎదిగేందుకు చైనా అరవై ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగా వాయువ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవేం కాదు. కాకుంటే.. ఇటీవల కాలంలో మళ్లీ న్యూక్లియర్ బాంబులను పెద్ద ఎత్తున తయారీ కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఈ సీక్రెట్ ప్రాజెక్టును జిన్ పింగ్ ప్రభుత్వం నానాటికీ విస్తరించుకుంటున్న విషయం తాజా కథనం స్పష్టం చేసిందని చెప్పాలి. ఇటీవల కాలంలో అంటే 2019 నుంచి ఈ రహస్య ప్రాజెక్టు మరింతవేగంగా నిర్వహిస్తున్నట్లుగా తన కథనంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
భారీ ఎత్తున నిర్మాణాల్ని చేపట్టిన చైనా.. బలమైన గోడల్ని తయారు చేసినట్లు చెబుతున్నారు.ఒక అంచనా ప్రకారం పింగ్ టాంగ్ ప్లాంట్ లో యూరేనిజయం శుద్ధి పనులు వేగంగా సాగుతున్నట్లుగా పేర్కొన్నారు. అణ్వాయుధాల విషయంలో రష్యా.. అమెరికా.. తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది చైనా ఆలోచనగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా వద్ద అత్యధికంగా 5400 అణు వార్ హెడ్లు ఉంటే.. అమెరికా వద్ద 5200 ఉన్నాయి. ఇక.. చైనా వద్ద ఇప్పటికే ఉన్న 600 అణు హెడ్ల సామర్థ్యాన్ని వెయ్యికి పెంచాలన్నది డ్రాగన్ ఆలోచనగా న్యూయార్క్ కథనం అంచనా వేస్తోంది. దీనిపై చైనా ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.