రేషన్ వాహనాలకి మంగళం.... కూటమి కీలక నిర్ణయం!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇంటింటికీ రేషన్ అన్న విధానం తీసుకుని వచ్చింది. దాంతో గడచిన నాలుగేళ్ళుగా ఏపీలో రేషన్ వాహనాలు రోడ్ల మీద తిరుగుతున్నాయి;

ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇంటింటికీ రేషన్ అన్న విధానం తీసుకుని వచ్చింది. దాంతో గడచిన నాలుగేళ్ళుగా ఏపీలో రేషన్ వాహనాలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. వీటికి మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్లుగా పేరు పెట్టింది. ఇలా మొత్తం తొమ్మిది వేల 260 కి పై చిలుకు వాహనాలను ఏకంగా 1860 కోట్ల రూపాయలను వెచ్చించి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పైగా ఈ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి నెలకు ఒక్కో వాహనానికీ 27 వేల రూపాయాలు చెల్లిస్తూ వచ్చింది.
ఇంత చేసినా కూడా ప్రజలందరికీ రేషన్ అందడం లేదు. ముప్పయి శాతం ప్రజానీకానికి రేషన్ పంపిణీ కావడం లేదని ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలో వెల్లడి అయింది. దాంతో ఈ విధానం వల్ల ఎక్కడా జవాబుదారీ తనం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక రేషన్ సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు.
ఇదే కాదు మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్లు వాహణదారుల మీద పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని అంటున్నారు. ఇలా చౌక బియ్యం అక్రమ రవాణా కోసం ఏకంగా ఒక గ్రీన్ చానల్ ని ఏర్పాటు చేసుకుని వాహనాల ఆపరేటర్లు దందా చేస్తున్నారు అని అంటున్నారు. దొంగ లెక్కలు చూపించి మరీ బియ్యాన్ని దారి మళ్ళించారు అని అంటున్నారు.
దీంతో ప్రభుత్వానికి అధిక భారంతో పాటు ప్రజలకు ఏ మేరకు మేలు చేయని మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్లు వ్యవస్థను రద్దు చేయడమే మంచి విధానం అని కూటమి ప్రభుత్వం భావించింది. దాంతోనే వాహనాలు రద్దు చేయడం ఉత్తమ నిర్ణయంగా తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక మీదట చౌక దుకాణాల వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఇది పేదలకు ప్రయోజనం కలిగించే విధానంగా ఉంటుందని అన్నారు. మొత్తం మీద చూసుకుంటే రేషన్ వాహనాలకు చెల్లు చీటి రాశారు. అయితే ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది.
రేషన్ వాహనాలు ఎపుడు వస్తాయో తెలియదని దుకాణం వద్ద అయితే తమకు వీలు అయిన సమయాలలో వచ్చి సరుకులు తీసుకుంటామని తెల్లరేషన్ కార్డు దారులు అంటున్నారు. అయితే చౌక దుకాణాలను తెరచి ఉంచాలని వారు కోరుతున్నారు. మొత్తానికి రేషన్ వాహనానికి మంగళం పాడేశారు అన్నది వాస్తవం.