ఈ స్టార్ హీరోలు కోర్టు నోటీసులు అందుకోవాల్సినంత నేరం చేసారా?

వీలున్నంత‌వ‌ర‌కూ మీడియా అవేర్ నెస్ పెంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అయితే ఎంత తెలిసినా ప్ర‌జ‌ల‌కు వీటిని అమ్ముతూనే ఉంటారు. కొంటూనే ఉంటారు. తిన‌కూడ‌నివి తింటూనే క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర రోగాల‌కు చికిత్స పొందుతూనే ఉంటారు.

Update: 2026-08-16 08:18 GMT

కోలాలు, పాన్‌లు, గుట్కాలు లేదా ఆన్ లైన్ జూదం.. వీటిని ప్ర‌మోట్ చేసేవాళ్లు ఏ కేట‌గిరీకి చెందుతారు? అనేది ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికీ అవ‌గాహ‌న లేదు! కానీ కోర్టులు, జ‌డ్జిలు, లాయ‌ర్లకు చాలా స్ప‌ష్ఠ‌త ఉంది. వీలున్నంత‌వ‌ర‌కూ మీడియా అవేర్ నెస్ పెంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అయితే ఎంత తెలిసినా ప్ర‌జ‌ల‌కు వీటిని అమ్ముతూనే ఉంటారు. కొంటూనే ఉంటారు. తిన‌కూడ‌నివి తింటూనే క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర రోగాల‌కు చికిత్స పొందుతూనే ఉంటారు. ఇదంతా ఒక మాయాలోకం. తెలిసి తెలిసీ త‌ప్పు చేసే ప్ర‌జానీకం ఇది!

ఏది ఏమైనా ఇప్పుడు ఇలాంటి త‌ప్పుడు వ్య‌స‌నాల‌కు ప్రజ‌ల‌ను బానిస‌ల్ని చేయ‌డంలో సెల‌బ్రిటీల భాగ‌స్వామ్యంపై కోర్టులు చాలా సీరియ‌స్ గా ఉన్నాయి. కింగ్ ఖాన్, దేవ‌గ‌ణ్, టైగ‌ర్ ష్రాఫ్ వంటి వారిని కూడా వ‌దిలిపెట్టే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు పైన చెప్పిన స్టార్ హీరోలకు నోటీసులు పంప‌డంతో దీనిపై ప్ర‌జ‌ల‌కు మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింది. కేసు డీటెయిల్స్ లోకి వెళితే...

సినిమా తారలు తమ క్రేజ్‌ను ఉపయోగించి బ్రాండ్లను ప్రమోట్ చేయడం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తులను లేదా వాటితో ముడిపడి ఉన్న బ్రాండ్లను ప్రమోట్ చేయడంపై సమాజంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. కూల్ డ్రింక్స్, పాన్ మసాలాలు వంటి ప్రకటనల్లో సెలబ్రిటీలు కనిపించడం ద్వారా ప్రజలు ముఖ్యంగా యువత ఈ వ్యసనాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఎంత అవగాహన కల్పించినా ప్రజలు వీటిని కొంటూనే ఉండటం.. చివరికి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం ఒక నిరంతర విషవలయంగా మారింది. ఆన్‌లైన్ జూదంలోను ప్ర‌జ‌ల్ని భాగ‌స్వామ్యం చేయ‌డంలో సెల‌బ్రిటీల పాపం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఇలాంటి తప్పుడు అలవాట్లకు ప్రజలను బానిసలుగా మార్చడంలో సెలబ్రిటీల పాత్రపై ఇప్పుడు న్యాయస్థానాలు, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌.డి.ఏ) షోకాజ్ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ ఇమేజ్‌తో ఏళ్ల తరబడి పరోక్షంగా హానికర ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై కోర్టులు, అధికారులు సీరియస్‌గా స్పందించడం ఇదే మొదటిసారి కాకపోవడం గమనార్హం.

ఈ నటులకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం వారు నటించిన `విమల్ ఇలాచీ(యాల‌కులు)` ప్రకటన. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం `విమల్ పాన్ మసాలా` అమ్మకంపై నిషేధం ఉంది. అయితే ఈ ప్రకటన రూపంలో వచ్చిన ప్రమోషన్ విమల్ బ్రాండ్ పేరును, దానికి సంబంధించిన పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రమోట్ చేసే విధంగా ఉందనేది అధికారుల ప్రాథమిక అభియోగం. ప్రకటనలోని డైలాగులు, ప్రదర్శన శైలి పాన్ మసాలా రంగాన్నే గుర్తుచేస్తున్నాయని ఎఫ్‌డీఏ నోటీసుల్లో పేర్కొంది.

మహారాష్ట్ర ఎఫ్‌డీఏ పరిశీలిస్తున్న ప్రధాన అంశం `సరోగట్ అడ్వర్టైజింగ్` (పరోక్ష లేదా ప్రాక్సీ ప్రకటనలు). నిషేధంలో ఉన్న లేదా ఆంక్షలు ఉన్న ఉత్పత్తులను (పాన్ మసాలా, మద్యం వంటివి) నేరుగా టీవీల్లో ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. అందుకే ఆయా కంపెనీలు తమ బ్రాండ్ పేరుతో ఏలకులు, సోడా లేదా తాగునీరు వంటి సాధారణ వస్తువుల ప్రకటనలను రూపొందించి పరోక్షంగా అసలు ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాయి. విమల్ ఏలకుల యాడ్ కూడా ఇదే కేటగిరీ కిందకు వస్తుందా? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

అయితే ఈ షోకాజ్ నోటీసులు జారీ చేయడం అనేది నటులు తప్పు చేసినట్లు ఇచ్చిన తుది తీర్పు కాదని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. బ్రాండ్ అంబాసిడర్లుగా లేదా ప్రమోటర్లుగా ఆ ప్రకటనల్లో భాగస్వాములైనందుకు గాను వారి వద్ద ఉన్న ఆధారాలు, వివరణలను సమర్పించాలని నటులను కోరింది. వారి నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎఫ్‌డీఏ ప్రకటించింది. ఏది ఏమైనా.. ఈ ఘటనతో సెలబ్రిటీలు చేసే ఎండోర్స్‌మెంట్లపై ప్రజల్లో ఒక స్పష్టత రావడంతో పాటు నటులపై కూడా బాధ్యత పెరిగినట్లయింది.

Tags:    

Similar News