విశ్వనాథ్ కోసం పవన్-త్రివిక్రమ్ డీవీడీ

Update: 2017-04-27 06:40 GMT
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు.. రాజకీయ నేతలు ఆయన ఇంటిని ముంచెత్తేస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి వెళ్లి విశనాథుడిని కలిసి అభినందిస్తే.. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మరో హీరో అల్లు అర్జున్ ఈ లెజెండరీ డైరెక్టర్ని కలిశారు. అభినందించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్-పవన్ కలిసి విశ్వనాథ్ తీసిన గొప్ప సినిమాలతో ఒక డీవీడీ తీసుకొచ్చే ప్రతిపాదన చేశారు. దీని గురించి త్రివిక్రమ్ మీడియాకు వివరించాడు. ‘‘విశ్వనాథ్ గారి ప్రతి చిత్రమూ ప్రత్యేకమే. అయితే వాటిలోంచి ది బెస్ట్ అనదగ్గ 12 సినిమాల్ని ఎంచుకుని ప్రత్యేకమైన డీవీడీ తీసుకొద్దాం అని పవన్ ఇంతకుముందే నాతో ప్రస్తావించాడు. ఇప్పుడు ఆ పనికి శ్రీకారం చుడతాం. విశ్వనాథ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం మొత్తంగా అవార్డులకే ఒక గౌరవం వచ్చింది’’ అని త్రివిక్రమ్ అన్నాడు.

ఇక విశ్వనాథ్ ను కలిసిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. స్వయంకృషి సినిమా షూటింగ్ సందర్భంగా అన్నయ్యతో కలిసి సెట్ కు వెళ్లేవాణ్ని. అలా ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం. ఐతే నేను సినిమాల్లోకి వచ్చాక విశ్వనాథ్ గారికి పెద్దగా కలిసింది లేదు. ఆయన ప్రతి సినిమా నాకు ఇష్టమే. కానీ ఆయనతో సినిమా చేయాలని మాత్రం అనిపించలేదు. ఎందుకంటే నాకు ఆయన దర్శకత్వంలో పని చేసేంత నటన రాదు’’ అని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News