రామ్ చ‌ర‌ణ్ - శంకర్ మూవీకి లైన్ క్లియ‌ర్‌..? కోర్టు ఏం చెప్పిందంటే..

Update: 2021-04-02 16:34 GMT
దిగ్గ‌జ దర్శ‌కుడు శంక‌ర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో దిల్ రాజు ఓ సినిమా అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు ఇండియ‌న్‌-2 నిర్మాత‌లు అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేసిన సంగతి కూడా తెలిసిందే. స‌గం పూర్తిచేసిన త‌మ సినిమాను కంప్లీట్ చేసిన త‌ర్వాతే.. నెక్స్ట్ సినిమా తీసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కోర్టుకు వెళ్లింది.

ఈ పిటిష‌న్ ను కోర్టు ఇవాళ విచారించింది. ఈ సంద‌ర్భంగా లైకా త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు ఎదుట త‌మ వాద‌న‌లు వినిపించారు. మొద‌ట్లో ఈ చిత్ర బడ్జెట్ 150 కోట్లుగా నిర్ణ‌యించార‌ని, ఆ త‌ర్వాత 236 కోట్ల వ‌ర‌కు వెళ్లింద‌ని లాయ‌ర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ.. 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని తెలిపారు. కానీ.. ఇప్పుడు సినిమా పూర్తి చేయ‌కుండా.. మ‌రో ప్రాజెక్టును చేప‌ట్టార‌ని కోర్టుకు తెలిపారు.

అంతేకాకుండా.. ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు రూ.40 కోట్ల రెమ్యున‌రేష‌న్ చెల్లించ‌డానికి నిర్మాత‌లు ఒప్పుకున్నార‌ని, ఇప్ప‌టికే రూ.14 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించిన‌ట్లు కోర్టుకు తెలిపారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో మిగిలిన రూ.26 కోట్ల బ‌కాయిని కూడా క్లియ‌ర్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. అందువల్ల.. శంక‌ర్ ఇండియ‌న్‌-2 పూర్తి చేసే వ‌ర‌కూ భ‌విష్య‌త్ ప్రాజెక్టు కొనసాగించకుండా మ‌ధ్యంత‌ర స్టే ఇవ్వాల‌ని కోరారు.

వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. శంక‌ర్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుపై మ‌ధ్యంత‌ర స్టే ఇవ్వ‌డానికి నిరాక‌రించారు. అయితే.. శంక‌ర్ ను వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది న్యాయ‌స్థానం.

ఈ నేప‌థ్యంలో శంక‌ర్ కోర్టుకు ఎలాంటి స‌మాధానం చెబుతారు? కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. శంకర్ భవిష్యత్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. రామ్ చరణ్ సినిమా అనుకున్న సమయానికే పట్టాలెక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News