మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు.. ‘తాండవ్’పై ఎఫ్ఐఆర్!

Update: 2021-01-18 04:54 GMT
హిందూ దేవతలను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని, తమ మనోభావాలను దెబ్బతీశారన్న ఫిర్యాదు మేరకు ‘తాండవ్’ వెబ్ సిరీస్ పై కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్ లోని లక్నో పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం.. ఆ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం.

‘తాండవ్‌’ వెబ్ సిరీస్ లోని మొదటి పార్ట్ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇందులో హిందూ దేవుళ్లను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలను సంధించారని, అందువల్ల ఈ సిరీస్‌ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డిమాండ్ చేశారు.
 
ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ న‌టులు సైఫ్ అలీఖాన్‌, డింపుల్ క‌పాడియా త‌దిత‌రులు న‌టించారు. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరించడం, దాన్ని యధాతథంగా ఓటీటీలో ప్ర‌ద‌ర్శించ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అమెజాన్ ప్రైమ్‌ను కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల‌శాఖ కోరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

అమెజాన్ ప్రైమ్ ఇండియా ఒరిజినల్ కంటెంట్ హెడ్ అపర్ణ పురోహిత్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహతా, రైటర్ గౌరవ్ సోలంకి, మరి కొందరు చిత్ర యూనిట్ సభ్యుల పేర్లను ఇందులో చేర్చారు.

‘తాండవ్’ వెబ్ సిరీస్‌ను అడ్డుకోవాలని మ‌హారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్ ఆదివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్ల‌ను, దేవ‌త‌ల‌ను కించ‌ప‌రిచారంటూ ఆరోపించారు. ఈ  అంశాన్ని బీజేపీ ఎంపీ మ‌నోజ్ కోట‌క్.. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
Tags:    

Similar News