అమృత విలాస్‌ మళ్లీ ఓపెన్‌ అవ్వబోతుంది

Update: 2020-02-24 01:30 GMT
1980.. 1990 కాలంలో పిల్లలుగా ఉన్న వారికి అమృతం సీరియల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడే బుల్లి తెర ప్రాచుర్యం పొందుతున్న సమయంలో.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుండి టీవీ కలర్‌ కు మారిన ఆ సమయంలో ప్రారంభం అయిన అమృతం సీరియల్‌ పిల్లలను పెద్దలను ఏ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమృతం సీరియల్‌ అనేది ఒక్కో ఎపిసోడ్‌ లో ఒక థీమ్‌ తో సాగుతుంది. అలా విభిన్నమైన కామెడీ కాన్సెప్ట్‌ లతో తీయడం వల్ల అప్పట్లో ఆ సీరియల్‌ ను పిల్లలు తెగ ఎంజాయ్‌ చేసే వారు.

ఇప్పటికి కూడా యూట్యూబ్‌.. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ల మీద అమృతం సీరియల్‌ ను స్ట్రీమ్‌ చేసే వారు చాలా మందే ఉన్నారు. అమృతం ప్రియులందరికి ఒక గుడ్‌ న్యూస్‌. అమృతంను ఇష్టపడే వారి కోసం అమృతం సీరియల్‌ మళ్లీ రాబోతుంది. అయితే ఈసారి ఏదో ఒక ఛానెల్‌ లో కాకుండా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అయిన జీ5 లో ఈ సీరియల్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అమృతం 2 అనే టైటిల్‌ తోనే ఇది ప్రసారం కాబోతుంది.

అమృతం పాత్రలో శివాజీ రాజా కొన్నాళ్లు.. నరేష్‌ కొన్నాళ్లు.. ఆ తర్వాత హర్షవర్ధన్‌ చేశారు. ఎక్కువగా హర్షవర్దన్‌ చేయడంతో అమృతం అనగానే అంతా కూడా ఆయన్నే గుర్తుకు తెచ్చుకుంటారు. అందుకే అమృతం 2 కు కూడా అమృతరావు పాత్రలో హర్షవర్ధన్‌ ను తీసుకున్నారు. ఇక అమృతం స్నేహితుడు అయిన ఆంజనేయులు పాత్రను మొదటి నుండి చివరి వరకు కూడా గుండు హనుమంతరావు చేశాడు. ఆయన మరణంతో ఇప్పుడు ఆ పాత్రను ఎల్బీ శ్రీరామ్‌ చేస్తున్నాడు.

ఇక అప్పాజీ.. సర్వం పాత్రలను వారే కంటిన్యూ చేస్తున్నారు. అమృతం భార్య పాత్రను సత్యకృష్ణ చేస్తోంది. అమృతం 2 గురించి జీ5 అధికారికంగా ప్రకటించింది. అతి త్వరలో జీ5 లో అమృతం 2 స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతోంది. అమృతం 2కు కూడా రచయితగా గుణ్ణం గంగరాజు వ్యవహరిస్తుండగా సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


Similar News