వాయిస్ ఆఫ్ వైసీపీ : సముచిత స్థానంలోకి దుర్గేష్

Update: 2018-02-23 17:21 GMT
రాజకీయ వ్యూహకర్త - వ్యవస్థీకృతంగా పార్టీ వ్యవహారాలను నిర్వహించడంలో అనుభవజ్ఞుడు - విషయ పరిజ్ఞానంలో దిట్ట - రాజ్యాంగం - చట్టం - ప్రజాప్రతినిధిగా బాధ్యతల విషయంలో తిరుగులేని పట్టున్న నాయకుడు అయిన కందుల దుర్గేష్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమతులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఇద్దరు అధికారప్రతినిధులను నియమిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటన వచ్చింది. ఇందులో రాజమండ్రి రూరల్ జిల్లా పరిధికి చెందిన కందుల దుర్గేష్ లను - విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన ఏకేవీ జోగినాయుడు - అధికార ప్రతినిధులుగా నియమించారు.

కందుల దుర్గేష్ స్వతహాగా మంచి వక్త. విద్యావంతుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా కూడా సేవలందించారు. తూర్పుగోదావరి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో రాహుల్ గాంధీ కి సన్నిహితంగా మెలగుతూ ఆయన కోర్ టీమ్ లో ఒకరిగా వ్యూహకర్తగా కూడా కందుల దుర్గేష్ గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రజలతో నిత్యం సన్నిహితంగా ఉంటూ ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన దుర్గేష్ గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్ మీద పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటినుంచి జగన్ తోనే ఉంటూ.. పార్టీ కోసం కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పటికి ఆయన విజ్ఞత - నైపుణ్యాలకు తగిన రీతిలో అధికార ప్రతినిధి హోదా లభించింది.
 
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఒకవైపు ప్రజాసంలక్పయాత్ర కొనసాగిస్తూనే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణానికి, పటిష్టత గురించి  కూడా సమానంగా దృష్టిపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంత ఒత్తిడితో కూడిన పాదయాత్ర షెడ్యూలు మధ్యలో పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. వ్యూహరచన చేస్తూ సాగుతున్న జగన్.. తాజాగా కొత్త అధికార ప్రతినిధుల నియామకంతో.. మరింత జోరు పెంచడానికి నిర్ణయించినట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News