గవర్నర్‌తో జగన్ భేటీ.. భేటీలో కీలక అంశాలపై చర్చ!

Update: 2021-10-28 13:10 GMT
గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ అయ్యారు. ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి జగన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, టీడీపీ కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. తనపట్ల టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను గవర్నర్‌ దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో జగన్ చర్చించారని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా గవర్నర్‌కు వివరించారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 17 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, పట్టాభి వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, టీడీపీ నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన వల్ల గవర్నర్‌తో జగన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవాడలో జరుగనుంది. 50 మందికి పైగా ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
Tags:    

Similar News