ఓటమి..ఉత్తమ్ కు అవమాన భారంగా మారిందా!

Update: 2019-11-15 01:30 GMT
ఎంపీగా నెగ్గినప్పుడు ఉత్తమ్ కుమార్  రెడ్డి హవా కొనసాగినట్టుగా అనిపించింది. తక్కువ కాలంలోనే కాంగ్రెస్ లో క్రియాశీల నేతగా ఎదిగారు ఉత్తమ్. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన టైమ్ మొదలైంది. కిరణ్ కు తెలంగాణలో అనుచరుడిగా చలామణి అయ్యాడు ఉత్తమ్.

ఆ  వెంటనే రాష్ట్ర విభజన తర్వాత అధిష్టానానికి దాసుడిగా ప్రాధాన్యత పొందాడు. సీనియర్ల ఆధ్వర్యంలో పార్టీ ఓటమి పాలు కావడంతో ఉత్తమ్ కు మంచి అవకాశాలు దక్కాయి. పీసీసీ చీఫ్ కూడా అయ్యారు.

అయితే ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బోల్తా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు అయ్యింది. అయినా తన సొంత నియోజకవర్గంలో ఉత్తమ్ నెగ్గారు.

ఆ వెంటనే వచ్చిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా నెగ్గి ఉత్తమ్ సత్తా చూపించాడు. పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కావడంతో ఆయన నెగ్గారు. రచ్చ నెగ్గిన ఉత్తమ్ మళ్లీ ఇంట ఓడిపోయారు. ఎమ్మెల్యేగా నెగ్గిన నియోజకవర్గంలో భార్యను ఉప ఎన్నికల్లోపోటీ చేయించి నెగ్గించుకోలేకపోయారు ఉత్తమ్ రెడ్డి. ప్రత్యర్థులకు భారీ మెజారిటీని ఇచ్చి ఓటమిని మూటగట్టుకున్నారు.

ఈ  నేపథ్యంలో ఆ ఓటమిని అవమాన భారంగా భావిస్తున్నారట ఉత్తమ్ రెడ్డి. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత ఆయన పెద్దగా బయటకు కూడా రావడం లేదని, నియోజకవర్గం పరిధిలో పర్యటించడం లేదని…చాలా వరకూ ఇంటికే పరిమితం అవుతూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

హుజూర్ నగర్ బై పోల్  లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పీసీసీ పదవిని వదలుకోవడానికి కూడా రెడీ అని సోనియాకు సమాచారం ఇచ్చారనే వార్తలు ఇది వరకే వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఉత్తమ్ కు ప్రత్యామ్నాయంగా నేతను సోనియాగాంధీ ఎంపిక చేయలేదు. ఉత్తమ్ మాత్రం చాలా అవమాన భారంతో ఉన్నట్టుగా టాక్ వస్తోంది.

Tags:    

Similar News