జగన్ ను అడ్డుకున్నారని టీడీపీ నేత రాజీనామా

Update: 2017-01-30 09:14 GMT
విపక్ష వైసీపీ అధినేత జగన్ ను మొన్న ప్రత్యేక హోదా ర్యాలీకి వెళ్లకుండా విశాఖలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా టీడీపీ నేత ఒకరు రాజీనామా చేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఏపీ ప్రత్యేక్ హోదా కోసం విశాఖ రామకృష్ణా బీచ్ లో కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి వెళ్తున్న జగన్ ను పోలీసులు అడ్డుకోవడం... కార్యక్రమం వాయిదా పడడం తెలిసిందే. అయితే.. ప్రత్యేక హోదా కోసం గొంతెత్తున్న వారిని ప్రభుత్వం అణచివేస్తుందనడానికి ఇది ఉదాహరణ అన్న భావన టీడీపీలోనూ వ్యక్తమవుతోంది. సరిగ్గా ఇదే అభిప్రాయంతో టీడీపీ సీనియర్ లీడర్ ఒకరు పార్టీకి రాజీనామా చేశారు.  విజయనగరం జిల్లా నేత - మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు ఇదే కారణంతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
    
ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జిల్లా అధ్యక్షుడికి పంపించారు.  ఆ లేఖలో ఆయన ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తేవడంలో తెలుగుదేశం విఫలమైందని, హోదా సాధనకు ప్రయత్నిస్తున్నవారిని అడ్డుకోవడం తనను కలచివేసిందని అందులో రాశారు.
    
ప్రత్యేక హోదాపై ఆందోళన చేసిన జగన్ ను అడ్డుకోవడం, విశాఖపట్నం విమానాశ్రయంలో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానని వాసిరెడ్డి విలేకరులతో తెలిపారు. కాగా, వాసిరెడ్డి త్వరలోనే వైకాపాలో చేరనున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News