కడప సీట్లు పెరిగేవెన్ని.. తరిగేవెన్ని.. ?
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మార్పులు ఖాయం. ఈ పరంపరలో సీమలోని కీలకమైన జిల్లా కడపలోనూ భారీ మార్పులు జరగనున్నాయి.;
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మార్పులు ఖాయం. ఈ పరంపరలో సీమలోని కీలకమైన జిల్లా కడపలోనూ భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే.. పునర్విభజన జరిగితే.. ఈ సంఖ్య పెరుగుతుంది. 10 అసెంబ్లీ స్థానాలను 12 లేదా 14కు పెంచే అవకాశం ఉంది. దీనిలోనూ కీలకమైన పులివెందుల నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పులివెందుల నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్కు సొంత స్థానం కావడంతో ఇక్కడ పాగా వేయాలన్నది కూటమి పార్టీలకు ప్రధాన లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే.. ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలు గత 20 ఏళ్లలో ఫలించలేదు. కానీ.. ఇప్పుడు పునర్వి భజన జరిగితే..పులివెందులలోని కొన్ని మండలాలను విడదీసి.. వేరే నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉంటుంది. దీనిపై స్థానిక నాయకులు దృష్టి పెట్టారు.
సింహాద్రిపురం, చక్రాయ పేట, వేంపల్లెలలో వైసీపీ మద్దతు దారులు అధికంగా ఉన్నారు. ఇదే జగన్కు బలంగా మారింది. ఈ మండలాలలో కొన్నింటిని విడదీసి ప్రత్యేక నియోజకవర్గంలో కలిపితే.. వైసీపీకి ఆ టోమేటికగ్నే బలం సన్నగిల్లుతుంది. ఇక, కడప నియోజకవర్గంలోనూ ఇదే తరహా వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది. కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు న్న పరిస్థితిలో కడపను కూడా పునర్విభజన పరిధిలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
వాస్తవానికి కడపలో ఒకే ఒక మండలం ఉంది.. కడప పేరుతోనే ఉన్న ఈ మండలం.. విస్తారంగా ఉంది. దీంతో దీనిని విభజించి పొరుగున ఉన్న కొన్ని మండలాలను కలుపుకొని నియోజకవర్గం ఏర్పాటు చేస్తే బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇక, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా చర్చ నడుస్తోంది. సో మొత్తంగా కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రధానంగా పులివెందులలో మార్పు లు తథ్యమని సమాచారం. అయితే.. ఏం చేసినా.. జనాభాలెక్కలు, మండలాల వారీగా ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.