కలసికట్టుగా...టీం ఇండియాగా...సీఎంలతో మోడీ !
పశ్చిమ ఆసియా సంక్షోభంలో తలెత్తిన పరిస్థితి దృష్ట్యా సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని ముఖ్యమంత్రులతో శుక్రవారం రాత్రి కీలకమైన సమావేశం నిర్వహించారు.;
పశ్చిమ ఆసియా సంక్షోభంలో తలెత్తిన పరిస్థితి దృష్ట్యా సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని ముఖ్యమంత్రులతో శుక్రవారం రాత్రి కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ఇండియాగా కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితిని విజయవంతంగా అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఇంధన భద్రతను నిర్ధారించడం, పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం, పరిశ్రమలను, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలని ప్రధాని నొక్కి చెప్పారు. అంతే కాదు సరఫరా గొలుసు కట్టు సజావుగా పనిచేసేలా చూడాలని, బ్లాక్ లో నిల్వలు, అధిక లాభాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ప్రధాని కోరారు. అంతే కాదు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీ పర్యవేక్షణ విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు.
పటిష్తమైన కో ఆర్డినేషన్ :
ఎప్పటికప్పుడు ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితులకు త్వరితగతిన స్పందించేందుకు అన్ని స్థాయిలలో పటిష్టమైన సమన్వయ యంత్రాంగాలు అవసరమని ప్రధాని ఉద్ఘాటించారు. నౌకా రవాణా, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీర రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని కోరడం విశేషం. అంతే కాదు తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తి పట్ల ప్రధాని హెచ్చరిస్తూనే కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అందించాలని ఆ దిశగా చూసుకోవాలని రాష్ట్రాలని కోరారు. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి అప్రమత్తత, సన్నద్ధత, సమన్వయ చర్యల ఆవశ్యకతను నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు.
కరోనా అనుభవంతో :
ఇక పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న పరిస్థితిని నరేంద్ర ప్రస్తావిస్తూనే ఇలాంటి ప్రపంచ అంతరాయాన్ని ఎదుర్కోవడంలో భారతదేశానికి పూర్వానుభవం ఉందని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలో సరఫరా గొలుసులు, వాణిజ్యం, దైనందిన జీవితంపై పడిన ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియాగా కలిసికట్టుగా పనిచేసిన తీరును ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడంలో అదే సహకార, సమన్వయ స్ఫూర్తి భారతదేశానికి అతిపెద్ద బలంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నర్ఫు. ఇక పరిస్థితి నిరంతరం మారుతూ ఉంటుందని దీనికి నిరంతర పర్యవేక్షణ, అనుకూల వ్యూహాలు అవసరమని ప్రధానమంత్రి చెప్పడం విశేషం. కేంద్ర స్థాయిలో మార్చి 3 నుంచి ఒక అంతర్-మంత్రివర్గ బృందం పనిచేస్తోందని అది పరిస్థితిని రోజువారీగా సమీక్షిస్తూ సకాలంలో నిర్ణయాలు తీసుకుంటోందని సీఎంలకు మోడీ తెలిపారు.
రాష్ట్రాలే కీలకం :
ప్రస్తుత సంక్షోభం నుంచి సజావుగా ముందుకు సాగేందుకు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని మోడీ స్పష్టం చేశారు. నిర్ణయాల సమర్థవంతమైన అమలు రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని అందుకే కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర సంప్రదింపులు సమన్వయంతో పాటు సకాలంలో సమాచారాన్ని పంచుకోవడం ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని మోడీ సూచించారు. రాష్ట్రాల స్థాయిలో హెల్ప్లైన్లను క్రియాశీలం చేయాలని అలాగే నోడల్ అధికారులను నియమించాలని, జిల్లా స్థాయి సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని మోడీ సీఎంలకు సూచించారు. ముఖ్య కార్యదర్శుల స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు చేయడం, జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణతో సహా అన్ని స్థాయిలలో పటిష్టమైన సమన్వయ యంత్రాంగాలు ఉండాల్సిన అవసరాన్ని కూడా ఆయన సీఎమల్కు దిశా నిర్దేశం చేశారు.
ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో :
ఇక రాష్ట్రాలు జీవ ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడంతో పాటు పైపుల ద్వారా సహజ వాయువు కనెక్షన్లను విస్తరించడంలో ప్రయత్నాలను వేగవంతం చేయాలని మోడీ కోరారు. రాష్ట్రాల సహకారంతో దేశీయంగా చమురు, సహజ వాయువు అన్వేషణను పెంచాల్సిన ప్రాముఖ్యతను కూడా మోడీ స్పష్టం చేశారు. ఈ సవాలును ఎదుర్కోవడం ఉమ్మడి బాధ్యత అని నరేంద్ర మోడీ పదే పదే చెప్పడం విశేషం. కలిసికట్టుగా పనిచేస్తే దేశం ఈ పరిస్థితిని విజయవంతంగా అధిగమిస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం మీద చూస్తే పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఎపుడేమి జరిగినా అంతా కలసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన చెప్పారని అంటున్నారు.