మద్యం రేటు పెరిగిందని శానిటైజర్ తాగి ముగ్గురు మృతి.

Update: 2020-06-30 08:45 GMT
ఏపీలో ఈ మధ్య కాలం లో మద్యం ధరలు భారీ గా పెరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రం లో సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగం గానే మద్యం ధరలు పెంచినట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే ఇదే కొందరి ప్రాణాలను తీస్తుంది.. మద్యం రేట్లు విపరీతంగా పెరగడంతో, అందుబాటులో ఉన్న ఆల్కహాల్ శానిటైజర్ తాగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా మద్యం రేటు పెరగడంతో మద్యాన్ని కొనలేక మరో ముగ్గురు శానిటైజర్ తాగి మృత్యువాత పడ్డారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరులో ఈ ఘటన వెలుగు చూసింది.

స్థానిక సింధు జంక్షన్‌ సమీపంలో యోగిమల్లవరం బీసీ కాలనీకి చెందిన నటరాజ్‌ అనే వ్యక్తి పాత సామాన్ల దుకాణం నడుపుతున్నారు. తమిళనాడు, తిరుపతికి చెందిన కొంతమంది చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్‌, చిత్తుకాగితాలు సేకరించి నటరాజ్‌ దుకాణంలో విక్రయిస్తూ ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా పుదిపేటకు చెందిన మల్లిక (23), లత (35) ఈ గుజరీ దుకాణం వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతి పేపర్స్‌ కాలనీకి చెందిన సెల్వం (50) కూడా  వీరితో ఉండేవాడు.

అయితే, ఇటీవలి కాలంలో లిక్కర్‌ ధరలు విపరీతంగా పెరగడం, శానిటైజర్‌ సీసాలు విరివిగా లభిస్తుండడంతో వీరు మత్తుకోసం శానిటైజర్‌ తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం శానిటైజర్‌ తాగినవెంటనే ఈ ముగ్గురి పరిస్థితి విషమించింది. శనివారం రాత్రి లత, మల్లిక గుజరీ దుకాణం వద్దే ప్రాణాలు కోల్పోయారు. మరోవ్యక్తి సెల్వం  ఆదివారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. శానిటైజర్లు సేవించడం ప్రాణాంతకమని సీఐ హెచ్చరించారు.
Tags:    

Similar News