ఆ ఏపీ బీజేపీ ఎంపీకి ఆ పార్టీ నేతలే ఎక్కువా...?
ఉమ్మడి విశాఖ పట్నంలోని అనకాపల్లి పార్లమెంటు రాజకీయ గ్రాఫ్ ఎలా ఉంది? ఇక్కడ ఎంపీ స్టయిల్ ఎలా ఉంది? ఇదీ.. తరచుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.;
ఉమ్మడి విశాఖ పట్నంలోని అనకాపల్లి పార్లమెంటు రాజకీయ గ్రాఫ్ ఎలా ఉంది? ఇక్కడ ఎంపీ స్టయిల్ ఎలా ఉంది? ఇదీ.. తరచుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఉమ్మడి విశాఖలో బీజేపీ దక్కించుకు న్న ఏకైక ఎంపీ స్థానం ఇదే. గతంలో విశాఖలో కంభంపాటి రామ్మోహన్రావు (ప్రస్తుతం ఒడిశా గవర్నర్) విజయం తర్వాత.. అనకాపల్లిలో బీజేపీ మొగ్గ తొడిగింది. ఎంపీగా సీఎం రమేష్ గెలుపు గుర్రం ఎక్కారు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ కొన్ని ఆశలు పెట్టుకుందని అంటారు.
స్థానికంగా బీజేపీకి ఉన్న బలాన్ని సీఎం రమేష్ రెట్టింపు చేస్తారని.. తద్వారా ఉత్తరాంధ్రలో మరింత బలంగా పాగా వేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నుంచే మాధవ్.. బీజేపీ రాష్ట్ర చీఫ్గా కూడా ఉన్నారు. అయితే.. సీఎం రమేష్ వ్యవహారం పార్టీలో చర్చకు వచ్చినప్పుడల్లా.. ఆయన తీరు వేరు.. అంటూ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నాయకుల కంటే కూడా.. మరో పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉన్నారన్నది బీజేపీ నేతలు చెబుతున్న మాట. సొంత పార్టీ కంటే కూడా కూటమిలో మరో పార్టీ నాయకులు చెప్పిన పనులే చకచకా అయిపోతున్నాయట.
అంతేకాదు.. నియోజకవర్గంలో సమాచారం కూడా తమకంటే ముందు ఓ పార్టీ నాయకులకు చెబుతున్నా రని.. ఆయన తమను కలుపుకొని పోవడం లేదని అంటున్నారు. అయితే.. ఆర్థికంగా.. బలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులు బయటకు ఏమీ విమర్శించలేక పోతున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో కనుక మరోసారి రమేష్కు టికెట్ దక్కతే.. ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని చూచాయగా చెప్పేవారు పెరుగుతున్నారు. ``ఆయన ముందు మేం చిన్నోళ్లం`` అని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక్క అనకాపల్లి నాయకులు మాత్రమే కాదు.. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పలు .. అసెంబ్లీ నియోజకవర్గాలలోని బీజేపీ నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. తమకు ఏమాత్రం టచ్లో ఉండడం లేదని అంటున్నారు. కానీ.. సీఎం రమేష్ వాదన వేరేగా ఉంది. స్థానికంగా తాను కార్యాలయం ఏర్పాటు చేశానని.. దానికి వచ్చి.. తమ సమస్యలు చెప్పుకోవచ్చని.. అన్నీతానే చూడాలంటే సాధ్యం కాదని ఆయన అంటున్నారు. అయితే.. ఎంపీ ఇటు అనకాపల్లి సహా.. అటు ఉమ్మడి కడపపైనా దృష్టిపెట్టారన్నది బీజేపీ నేతలు చెబుతున్నమాట. దీంతో ఆయనకు సహకరించేందుకు ఇష్టపడడం లేదని సమాచారం.