ఆఫ్ఘ‌నిస్థాన్‌ను చెర‌బ‌ట్టిన తాలిబ‌న్లు.. ఇక‌, మిగిలింది రాజ‌ధానే!

Update: 2021-08-13 08:50 GMT
ప్ర‌పంచం భ‌య‌ప‌డినంత ప‌నీ జ‌రిగింది. ఉగ్ర‌వాద దాడులు.. ముఖ్యంగా స్థానిక ఉగ్ర‌వాదంతో అత‌లాకుత లం అవుతున్న ఆఫ్ఘ‌నిస్థాన్‌.. ఇప్పుడు లోక‌ల్ ఎక్స్‌ట్రిమిస్ట్స్ తాలిబ‌న్ల చెర‌లో దాదాపు చిక్కుకుపోయింది. దాదాపు 11 ప్రావిన్సుల‌(రాష్ట్రాలు)ను తాలిబ‌న్లు త‌మ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని న‌గ‌రం.. కాబుల్‌లోనూ స‌గానికిపైగా ఆక్ర‌మించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌పంచం ఉలిక్కి ప‌డింది. ఆఫ్ఘ‌నిస్థాన్‌ను ఎలా కాపాడాల‌నే విష‌యంపై అమెరికా స‌హా ఐక్య‌రాజ్య‌స‌మితిలు ఇప్ప‌టికే దృష్టి సారించాయి. అయితే.. తాలిబాన్ల దూకుడు ముందు.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

కీల‌క న‌గ‌రాలు స్వాధీనం..

ఆఫ్గానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడు పెంచారు. ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించేశారు. రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా తాలిబన్లు వశపరుచుకున్నారు. కాబూల్‌-కాందహార్‌ జాతీయ రహదారిపై ఉన్న ఈ కీలక నగరాన్ని తాలిబన్లు ఆక్రమించిన విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ధ్రువీకరించింది. ఇప్పటికే అఫ్గాన్‌ ప్రభుత్వం ఉత్తర, పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను కోల్పోయింది.

రెప‌రెప‌లాడుతున్న తాలిబ‌న్ల జెండాలు

ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న ముష్కరులు కాబుల్కు సమీపంలోని ఘాజ్నీ నగరాన్ని, మూడో అతిపెద్ద నగరమైన హేరత్ను హస్తగతం చేసుకున్నారు. ఆక్రమణ అనంతరం నగరంలో తమ జెండాలను ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను తాలిబన్లే స్వయంగా పోస్ట్ చేశారు. ఘాజ్నీతో కలిపి మొత్తం 11 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయాయి. నగరం వెలుపల ముష్కరులకు, సైన్యానికి మధ్య ఘర్షణ జరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం కాబుల్ నగరానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. తాలిబన్ల దురాక్రమణ ఇంత వేగంగా సాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారం పంచుకుంటారా?

దేశ రాజధానితో పాటు మిగిలిన కొన్ని నగరాలను కాపాడుకునేందుకే సర్కారు పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో హింసను అదుపులోకి తెచ్చేందుకు ఆఫ్గాన్‌ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి సిద్ధమైంది. ఈ మేరకు ఖతార్‌లోని ఆఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమైన నేపథ్యంలో కాబూల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వ్యూహం మేర‌కు దెబ్బ‌

ఘాజ్నీ నగరాన్ని తాలిబన్లకు కోల్పోవడం.. అఫ్గాన్ సేనలకు వ్యూహాత్మక ఎదురుదెబ్బే అని తెలుస్తోంది. కాబుల్- కాందహార్ హైవే మధ్య ఉన్న ఈ నగరం.. అఫ్గాన్ రాజధానిని, ఆ దేశ దక్షిణాది రాష్ట్రాలను కలుపుతుంది. ఈ నగరం ఆక్రమణతో.. ఆఫ్గాన్ సైనికుల రవాణా కష్టతరం కానుంది. అదే సమయంలో, దక్షిణాది నుంచి అఫ్గాన్ భూభాగాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు తాలిబన్లకు ఇదో మంచి అవకాశంగా మారనుంది.

క‌దిలిన దేశాలు..

ఆఫ్గాన్ పరిస్థితులపై చర్చించేందుకు చైనా, పాకిస్థాన్, రష్యా ప్రతినిధులతో అమెరికా రాయబారి జాల్మే ఖలీల్జాద్ భేటీ అయ్యారు. దురాక్రమణను నివారించాలని తాలిబన్లను హెచ్చరించారు. లేదంటే అంతర్జాతీయంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఆఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ అధికారులతోనూ జాల్మే భేటీ కానున్నట్లు సమాచారం. జర్మనీ సైతం తాలిబన్లకు తీవ్ర హెచ్చరికలు చేసింది. అఫ్గాన్లో తాలిబన్ల పాలన పాలన ఏర్పాటైతే.. తమ దేశం అందిస్తున్న అభివృద్ధి సాయాన్ని ఆపేస్తామని స్పష్టం చేసింది. ఒక్క సెంటు కూడా తాలిబన్ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జర్మనీ నుంచి అఫ్గాన్కు 504 మిలియన్ డాలర్లు సాయంగా అందుతోంది.






Tags:    

Similar News