జగన్‌ పాలన గురించి తీన్మార్‌ మల్లన్న!

Update: 2022-12-02 08:55 GMT
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పరిపాలన బాగుందని తీన్మార్‌ మల్లన్న ప్రశంసించారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు భద్రాచలం నుంచి పోలవరం ముంపు మండలాల్లో పర్యటించానన్నారు. ఆ సందర్బంగా ప్రజలతో మాట్లాడినప్పుడు వారంతా జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు వ్యక్తం చేశారని తెలిపారు.

తమకు ఇంటికే పెన్షన్లు, రేషన్‌ బియ్యం వస్తున్నాయని ముంపు మండలాల ప్రజలు తెలిపారని మల్లన్న వెల్లడించారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ సైతం తమ ఇంటివద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలసిన ముంపు మండలాల ప్రజలు చెప్పారన్నారు.

తిరిగి తెలంగాణలో చేరుతారా అని ఆ ప్రజలను అడుగగా తెలంగాణ మాకొద్దు.. ఆంధ్రాలోనే ఉంటామని ముంపు మండలాల ప్రజలు చేతులు జోడించి చెప్పారని తీన్మార్‌ మల్లన్న తెలిపారు. ఏపీ ప్రభుత్వం తమకు అన్ని సంక్షేమ పథకాలను ఇంటి వద్దనే అందిస్తుందని చెప్పారన్నారు.

ఆంధ్రాపై జరుగుతున్న ప్రచారం ఒకలా ఉంటే అసలు నిజం మాత్రం ప్రజల్లో వేరేలా ఉందన్నారు. అన్ని పథకాలు తమకు ఒకటో తారీఖే వస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మల్లన్న తెలిపారు.

ఈ మేరకు ప్రతి రోజూ తీన్మార్‌ మల్లన్న నిర్వహించే యూట్యూబ్‌ చానెల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. వందల మందిని కలిస్తే ఒక్కరు కూడా బాలేదని చెప్పలేదన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, శ్రేణులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాయి.

మరోవైపు తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలను పట్టించుకోనవసం లేదని.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో మల్లన్న ప్రోగ్రాములు నిర్వహిస్తున్నారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు తప్పుబడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజల్లో తక్కువ చేసి చూపడానికి జగన్‌ ప్రభుత్వాన్ని మల్లన్న పొగుడుతున్నారని మండిపడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News