నారా లోకేష్ అరెస్టు.. స్టేష‌న్‌కు త‌ర‌లింపు.. ఏపీలో తీవ్ర ఉద్రిక్త‌త

Update: 2022-08-21 09:53 GMT
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ ప‌రిణామాలు.. రాష్ట్రంలో రాజ‌కీయ వేడిని మ‌రింత రెట్టింపు చేశాయి.  శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న ఆయనను ఆమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి. పోలీసులు,  శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

ఈ నేప‌థ్యంలో కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి లోకేష్‌ నిరసన తెలిపారు. పోలీసులకు లోకేష్‌కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్‌తో పాటు కళా వెంకట్రావు, చినరాజప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎచ్చెర్ల మండలం జేఆర్‌ పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీనివాసనగర్‌లోని 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని.. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూలగొడతామంటే తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ అడ్డు తగిలారు.

అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైసీపీ నాయకులు అక్కడకి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు నారా లోకేష్ అక్క‌డ‌కు వెళ్లారు. అయితే.. ఈ సంద‌ర్భంగా పోలీసులు అనేక ఆంక్ష‌లు విధించారు. పోలీస్ యాక్ట్ 30 అమ‌ల్లో ఉందని. ఎవ‌రూ ర్యాలీలు చేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ న‌గ‌రంలోకి అడుగు పెట్ట‌గానే అరెస్టు చేసి .. స్టేష‌న్‌కు త‌ర‌లించారు.
Tags:    

Similar News