ఇందిరమ్మ ఎపిసోడే మోడీ ఇష్యూలో రిపీట్

Update: 2016-12-04 05:40 GMT
ఆసక్తికర వ్యాఖ్యలకు.. హాట్ హాట్ ట్వీట్లతో హీటు పుట్టించే రాజకీయ నేతల్లో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ముందుంటారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు.. తనదైన శైలిలో తన మనసులోని మాటను చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడరు. సొంత.. పరాయ అన్నది సంబంధం లేకుండా ఎవరి మీదనైనా చాలు.. విమర్శనాస్త్రాల్ని సంధించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు.

నాలుగు రోజులు అటుఇటుగా నెల క్రితం ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ పై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఇందిరమ్మ హయాంలోని ఎమర్జెన్సీతో పోల్చిన ఆయన.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని కానీ సరిదిద్దకపోతే మోడీకి ఉన్నప్రజాదరణ కాస్తా ప్రజా వ్యతిరేకతగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆమె తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయంపై ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. కానీ ఆ తర్వాత ప్రజాదరణ మొత్తం ఆమెకు ప్రతికూలంగా మారిందన్న పాత విషయాన్ని కొత్తగా గుర్తు చేశారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని వెంటనే సరిదిద్దాలన్న సూచన చేశారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీద సునిశిత విమర్శలు చేశారు. నోట్ల రద్దు నిర్ణయం అమలు ఘోరంగా ఉందని.. ఆర్థికవేత్తలైన మంత్రులు దేశానికి అవసరమే కానీ.. రెండు ప్లస్ రెండు నాలుగు అనే వారి అవసరం లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎంపీ ధైర్యంగా తమపై చేసిన విమర్శలపై మోడీ పరివారం ఎలా రియాక్ట్ అవుతుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News