ఆ దేశ రాజకుటుంబంలో ఒకరిని చంపేసిన కరోనా

Update: 2020-03-29 05:36 GMT
రాజు.. పేద అన్న తేడా లేదు. సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒక్కటే. దేశాల సరిహద్దుల్ని అస్సలు పట్టించుకోకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోతూ.. దేశాల్ని దేశాల్ని చుట్టేస్తూ.. యావత్ ప్రపంచం మొత్తం ఆగమాగమయ్యేలా చేస్తోన్న కరోనా.. తాజాగా స్పెయిన్ రాజకుటుంబీకురాల్ని చంపేసింది. ప్రపంచంలో ఒక రాజకుటుంబానికి చెందిన వారు ఒకరు ఈ మహమ్మారి వైరస్ కారణంగా మరణించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

86 ఏళ్ల వయసులో స్పెయిన్ రాజు నాలుగో ఫెలిప్ కజిన్ ప్రిన్ సెస్ మారియా తెరాసా ప్యారిస్ లోని ప్యాలెస్ లో మరణించినట్లు రాజకుటుంబం వెల్లడించింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని.. వ్యాధి తీవ్రత పెరిగిపోయిన కారణంగా ఆమె చనిపోయినట్లుగా రాజ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో అంత్యక్రియలు నిర్వహించారు. చైనాలో పుట్టిన కరోనా.. ఊహించని వేగంతో యూరప్ మీద పడటం.. అందులోని పలు దేశాలు దాని బారిన పడటం.. అలెర్ట్ అయ్యే లోపే పలు దేశాలు కరోనా కోరల్లోకి చిక్కి విలవిలలాడుతున్నాయి.

కరోనా ధాటికి అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో స్పెయిన్ ఒకటిగా చెప్పాలి. ఒక్క శనివారం నాడే ఆ దేశంలో 7516 కొత్త కేసులు నమోదు అయ్యాయంటే.. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పొచ్చు. తాజాగా ఆ దేవంలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా 74వేలకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఒక్క శనివారమే ఆ దేశంలో కరోనా కారణంగా మరణించిన వారు 844 మంది కావటం ఒకఎత్తు అయితే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్న దేశాల్లో తొలి రెండు స్థానాల్లో ఇటలీ.. స్పెయిన్ లు ఉన్నాయి. ఈ రెండు చిన్న సంపన్న దేశాలు కరోనా భారీగా దెబ్బ తీసిందని చెప్పాలి.
Tags:    

Similar News