అసెంబ్లీ ఎన్నికల తర్వాతే చిన్నమ్మ విడుదల ...అసలు విషయం ఏమిటంటే ?

Update: 2020-10-09 11:45 GMT
చిన్నమ్మ శశికళ జైలు నుంచి బయటకు రాకుండా ఆలస్యం చేయడంలో కుట్ర  జరుగుతున్నట్టుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒకదాని వెనుక మరొకటి  జప్తు నోటీసులు జారీ చేస్తుండడంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పన అగ్రహార జైల్లో ఉన్న సంగతి  తెలిసిందే. 2021 జనవరిలో ఆమె శిక్షాకాలం ముగియనుంది. జరిమానా రూ. 10 కోట్లు చెల్లింపు తర్వాత జైలు నుంచి చిన్నమ్మ బయటకు రావడం ఖాయమని అమ్మ శిబిరం వర్గాలు దీమా వ్యక్తం చేశాయి.

దీనికి తగ్గ కసరత్తుల్లో  దినకరన్‌ పూర్తిగా బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అక్రమంగా ఆర్జించారంటూ ఆస్తుల అటాచ్, షోకాజ్‌ నోటీసులు ఒక దాని తర్వాత మరొకటి వెలువడుతుండడం అమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ఇప్పటికే ఐటీ రెండు విడతలుగా ఆస్తుల్ని జప్తు చేసింది, మూడో విడతగా రూ. రెండువేల కోట్ల ఆస్తులను బుధవారం అటాచ్‌ చేసింది.  నోటీసులను సిరుదావూర్‌ బంగ్లా, కొడనాడు ఎస్టేట్‌లలో ఐటీ వర్గాలు గురువారం అంటించి వెళ్లాయి.

అమ్మ వారసులుగా దీప, దీపక్ ‌లను కోర్టు ప్రకటించిన దృష్ట్యా,  వారికి కూడా షోకాజ్‌ నోటీసులు పంపడం గమనార్హం. ఇప్పటివరకు రూ. 3,900 కోట్ల విలువగల ఆస్తులను ఐటీ జప్తు చేసింది. చిన్నమ్మ విడుదలను అడ్డుకోవడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందని అమ్మ శిబిరం ఆరోపిస్తోంది. ఎన్నికల అనంతరం వచ్చేలా కుట్ర సాగుతోందని, అందుకే ఆస్తుల అటాచ్‌ లు, జప్తులు, షోకాజ్‌ నోటీసులు సాగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రల్ని చిన్నమ్మ భగ్నం చేస్తారని చెప్తున్నప్పటికీ , తాజా పరిణామాలు అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేశాయి.
Tags:    

Similar News