సెల్ఫీల కోసం క్యూ.. సజ్జనార్ క్రేజ్ మామూలుగా లేదుగా?

Update: 2019-12-15 04:35 GMT
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కీలకభూమిక పోషించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి. తాజాగా ఆయన ఏపీలో పర్యటిస్తున్నారు. సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం జిల్లా లేపాక్షిని సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన్నుచూసిన యువతీ యువకులు ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడటమే కాదు.. క్యూ కట్టటం గమనార్హం.

దిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటం.. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే నిందితుల్ని అదుపులోకి తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. పది రోజుల వ్యవధిలోనే ఎన్ కౌంటర్ కావటంపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సాహో సజ్జనార్ అంటూ పలువురు కీర్తించారు కూడా.

ఈ ఘటనలో సజ్జనార్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలోనే ఆయన ఎస్పీగా ఉన్న వేళలో వరంగల్ లో చోటు చేసుకున్న యాసిడ్ దాడి కేసు నిందితుల్ని సైతం ఎన్ కౌంటర్ చేయటంతో.. ఆయన్ను ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అభివర్ణిస్తారు. దిశ ఎపిసోడ్ తో ఆయన క్రేజ్ భారీగా పెరిగింది.

కుటుంబ సభ్యులతో కలిసి లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయానికి వచ్చిన ఆయన.. సంప్రదాయ పంచె కట్టి .. లాల్చీ ధరించారు. కర్ణాటకకు చెందిన సజ్జనార్ కుటుంబానికి వీరభద్రస్వామి ఇలవేల్పు. దీంతో.. ఆయనకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆయన్ను చూసినంతనే అక్కడున్న యువత ఆయన చుట్టూ చేరి సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. క్యూ పద్దతిలో ఆయనతో సెల్ఫీలు దిగటం గమనార్హం.


Tags:    

Similar News