అంబటి సహా.. వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు.. రీజనేంటి?
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా.. మరో 15 మందికిపైగా వైసీపీ నాయకులపై మంగళగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా.. మరో 15 మందికిపైగా వైసీపీ నాయకులపై మంగళగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అదేసమయంలో వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. టీడీపీకి చెందిన కొందరిపైనా కేసులు పెట్టారు. అయితే.. ఇవి సాధారణకేసులేనని పోలీసులు తెలిపారు. అంబటి రాంబాబు తమను దూషించార ని.. ఎస్సీలమైన తమపై దాడికి యత్నించారని రాజధాని అమరావతిలోని పెనుమాక కు చెందిన మాణిక్యం అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
ఇదేసమయంలో మంగళగిరి సీఐ... తన విధులకు వైసీపీ నాయకులు ఆటంకాలు కలిగించారని, విధుల్లో ఉన్న తనపైచేయి చేసుకునే ప్రయత్నం జరిగిందని పేర్కొంటూ మరో ఫిర్యాదు చేశారు. దీంతో మరో 15 మంది వైసీపీ నాయకులపై కేసులు నమో దు చేశారు. ఇక, తమ వాహనాలపై దాడులు చేయడంతోపాటు తమపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారని వైసీపీ నాయకుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని టీడీపీ కార్యకర్తలు, నాయకులపై నా కేసులు నమోదుచేశామని పోలీసులు చెప్పారు. మొత్తంగా ఇరు పక్షాలపైనా కేసులు నమోదు కావడం గమనార్హం.
ఏం జరిగింది?
రాజధాని అమరావతి కోసం.. ప్రభుత్వం భూ సమీకరణ(పూలింగ్) చేస్తోంది. అయితే.. కొందరు రైతులు.. తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. దీనిని కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. అయితే.. అదేసమయంలో తమ భూములకు రక్షణ లేకుండా పోతోందని.. తాము సాగు చేసుకునేందుకు ఆటంకాలు కలిగిస్తున్నారని.. కొన్నాళ్ల కిందట వైసీపీ అధినేత జగన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తమను ఆయా గ్రామాల్లో పర్యటించాలని రైతులు కోరినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలో శనివారం వైసీపీ నాయకులు కొందరు రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు రాగా.. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు వారిని అడ్డుకున్నారు. రాజధాని అమరావతిపై స్టాండ్ ఏంటని వైసీపీ నేతలను నిలదీశారు. మూడు రాజధానులు అన్నారని.. మావిగన్ అన్నారని.. తమను వేధించి, కేసులు కూడా పెట్టారని.. ఇప్పుడు తగుదునమ్మా.. అంటూ రాజధానిలో పర్యటించేందుకు వస్తే.. తామెందుకు రానిస్తామని రైతులు, మహిళలు వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు పక్షాల మధ్య దాడులు జరిగాయి.
రాష్ట్రంలో జంగిల్ రాజ్: బొత్స..
వైసీపీ నాయకులు, ముఖ్యంగా అంబటిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రం గా తప్పుబట్టారు. రైతులు కోరిన మీదటే తాము అమరావతిలో పర్యటించేందుకు వచ్చామన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. పోలీసులతో అణిచి వేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత విమ ర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు.. జంగిల్ రాజ్ నడుస్తోందని తనదైన శైలిలో బొత్స విమర్శలు గుప్పించారు.