సీఎం కాదు...చీప్ లిక్క‌ర్ ప్ర‌మోట‌ర్‌!

Update: 2016-11-16 04:28 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్రబాబు చీప్‌ లిక్కర్‌ కు ప్రమోటర్‌ గా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు - ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు ఇపుడు వీధికో బీర్‌ పార్లర్‌ పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న‌ప్ప‌టికీ ఎన్నికల ముందు ఆయన చేసిన ఏ ఒక్క వాగ్ధానం నెరవేరలేదని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన రోజా ఎన్నిక‌ల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న బాబు..అధికారంలోకి వచ్చాక వీధికో బెల్ట్‌ షాపు పెట్టిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం కాగానే తాను చేసిన ఐదు సంతకాల్లో మొదటి సంతకానికే ఇంతవరకు మోక్షం లేదని విమర్శించారు. బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామన్న చంద్రబాబు చీప్‌ లిక్కర్‌ ను తీసుకొస్తున్నారని, బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో బీచ్‌ పార్లర్స్ - బీర్‌ పార్లర్స్‌ ఏర్పాటు చేసేందుకు జీవోలను సవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్ర‌న్న చీప్ లిక్క‌ర్ ప‌థ‌కం - లోకేష్‌ వైన్స్ - బ్రాహ్మిణి బీర్స్ అంటారేమో అని రోజా అనుమానం వ్యక్తం చేశారు. వైన్‌ షాపులు - బీర్‌ పార్లర్స్‌ పై వైఎస్‌ ఆర్‌ సీపీ ప్రణాళిక బద్ధంగా పోరాటం చేస్తామని, షాపులను ధ్వంసం చేస్తామని రోజా హెచ్చరించారు.

రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని రోజా మండిప‌డ్డారు. విద్యార్థిని రిషితేశ్వరి ర్యాంగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకుంటే నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు అప్పుడేం చేశారని రోజా ప్రశ్నించారు. కాల్‌ మనీ–సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో పోలీసులు ఏం చేశారని నిలదీశారు. తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేని రోజా ప్రశ్నించారు. విజయవాడలో మకాం వేసిన చంద్రబాబు సమక్షంలోనే ఇంతటి దారుణాలు జరుగుతుండటం ఎంతవరకు సమంజసమన్నారు. బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్న జనానికి మద్దతుగా దీక్ష చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఆమె ఖండించారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైఎస్‌ ఆర్‌ సీపీ అండగా ఉంటుందని ఆర్కే రోజా హామీ ఇచ్చారు.

నోట్ల రద్దు వల్ల సామాన్యులెవరూ ఇబ్బందులు పడటంలేదంటూ ప్రధాన మంత్రి - ముఖ్యమంత్రి చెబుతుండటం హాస్యాస్పదమని రోజా విమర్శించారు. నోట్ల రద్దు ఈ బాడా బాబులకు ఎప్పుడో తెలుసని అందుకే చంద్రబాబు - వారి మంత్రులు పెట్టుబడుల పేరిట తరచూ విదేశాలకు వెళుతూ తమ వద్ద వున్న నల్లధనాన్ని మార్చుకున్నారని దుయ్యబట్టారు. పైగా జగన్ వద్ద నల్లధనం ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వద్ద ఏమైన ఉంటే వెతికి పట్టించవచ్చంటూ సవాల్ చేశారు. బీజేపీ-టీడీపీలో ఉన్న వారంతా నల్ల కుబేరులేనని రోజా అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోటానికి జగన్ గడపగడపకు యాత్ర ప్రారంభిస్తే దీనికి పోటీగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను మొదలు పెట్టారని అన్నారు. ముద్రగడ పాదయాత్రతో జగన్ సంబంధం లేదని, ఎవరినో అడ్డుపెట్టుకుని రాజకీయాలు నడపాల్సిన ఖర్మ ఆయనకు పట్టలేదని రోజా స్ప‌ష్టం చేశారు.


Tags:    

Similar News