పవన్ మీద కొత్త స్ట్రాటజీతో వైసీపీ ?

ఇదిలా ఉంటే రాజకీయం అంటే నిరంతరం ప్రవహించే నది లాంటిది. ఎన్నో డైమన్షన్లు ఉంటాయి. ఏది ఎక్కడా ఆగదు, ఏదీ శాశ్వతం కూడా కాదు, ఓడలు బల్లు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి.

Update: 2026-06-23 22:30 GMT

ఏపీలో అధికారం ఎందుకు పోగొట్టుకున్నామో వైసీపీకి అర్ధం అయింది. దానికి జగన్ తో సహా అందరూ కారకులే. ఒక్కరు తక్కువ స్థాయిలో మరొకరు ఎక్కువ షాయిలో అంతా కలసి 2019 నుంచి 2024 మధ్యలో పవన్ తో రాజకీయ చెలగాటమే ఆడారు. రెండు సీట్లలో ఓడిన పవన్ ఏమి చేయగలరన్న ధీమా ఒకటి అయితే 151 సీట్లతో గెలిచిన తాము మరో రెండు మూడు టెర్ములు కచ్చితంగా అధికారంలో ఉంటామన్న అతి విశ్వాసంతోనే పవన్ మీద వైసీపీ ఆనాడు అలా విరుచుకుపడింది. తాము పవన్ ని టార్గెట్ చేస్తున్నామని అనుకుంది కానీ పవన్ వెనకాల ఒక బలమైన సామాజిక వర్గం ఉందని గుర్తించలేకపోయింది.

పవన్ వెనక ఉన్నది :

పవన్ ని అన్న ప్రతీ మాట ఆ సామాజిక వర్గం సీరియస్ గా తీసుకుంది. పవన్ కూడా వైసీపీతో తాడో పేడో అన్నట్లుగా ఆనాడు వ్యవహరించారు. దాంతో పవన్ వ్యక్తిగత విషయాల మీదకు కూడా వైసీపీ నేతలు వచ్చి మరీ కార్నర్ చేశారు. దాని ప్రతిఫలం ఏమిటి అన్నది 2024 ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. పవన్ దెబ్బకు మొత్తం గోదావరి జిల్లాలలో సున్నా ఫలితాలు ఫ్యాన్ పార్టీకి వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీ అదే సమయంలో లాభపడ్డాయి. వైసీపీ అయితే సోదిలోకి లేకుండా పోయింది. దాంతో వైసీపీలో అంతర్మధనం మొదలైంది.

మార్పు సహజం కాబట్టి :

ఇదిలా ఉంటే రాజకీయం అంటే నిరంతరం ప్రవహించే నది లాంటిది. ఎన్నో డైమన్షన్లు ఉంటాయి. ఏది ఎక్కడా ఆగదు, ఏదీ శాశ్వతం కూడా కాదు, ఓడలు బల్లు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి. ఈ నేపధ్యంలోనే రెండేళ్ల కూటమి పాలన పట్ల ఎంతో కొంత వ్యతిరేకత అన్నది రావడం సహజం. ఇపుడు ఇదే వైసీపీలో కొత్త ఆశలు కల్పిస్తోంది. దాంతో పాటుగా కాపులలో కూడా మెల్లగా అసంతృప్తి కనిపిస్తోంది. ఇక పవన్ సైతం తనకు కులం అంటగట్టవద్దు అంటూ ఇచ్చిన ప్రకటనలు కూడా వైసీపీకి రాజకీయంగా ఆయుధంగా మారుతున్నాయి. దాంతో వైసీపీ భారీ స్కెచ్ నే గీస్తోంది.

కాపులకు దగ్గరగా :

తమ మీద తీవ్ర ఆగ్రహం చూపించి 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆపేసి రెక్కలు నిలిపేసిన కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు వైసీపీ తన వంతుగా ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇది అనివార్యం కూడా. అదే సమయంలో పవన్ విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద వైసీపీలో మల్లగుల్లాలు పడుతున్నారు. పవన్ అయితే ఈ రోజుకీ వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. తొక్కి నార తీస్తాను అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మామూలుగానే ఈ ప్రకటనల మీద వైసీపీ నుంచి గట్టి రియాక్షన్ వస్తుంది. అయితే ఇక్కడే వైసీపీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.

ఆగండి అంటూ :

తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ మీద వైసీపీ నేతలు ఎవరూ విమర్శలు చేయమాకండి అని ఒక కీలక సూచన చేశారు. పవని మీద ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడం వద్దు అని చెబుతూ తానే ఏమైనా ఉంటే పార్టీ తరఫున స్పందిస్తాను స్మూత్ గా డీల్ చేస్తాను అని కొస మెరుపు మెరిపించారు. దీంతో వైసీపీ పవన్ విషయంలో కొత్త స్ట్రాటజీతో వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. పవన్ ని ఏమైనా అంటే కచ్చితంగా కాపులలో వ్యతిరేకత వస్తుంది. అందుకే ఆయన విమర్శలను స్మూత్ గానే తీసుకుని వీలైనంత మేరకు రియాక్ట్ అవుతూ టీడీపీ మీదనే తమ రాజకీయ యుద్ధాన్ని కొనసాగించాలని వైసీపీ నిర్ణయించింది అని అంటున్నారు. మరి వైసీపీ ఈ కొత్త వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News