రోజా ప్ర‌శ్న:ప‌వ‌న్ అప్పుడు మంచోడు..ఇప్పుడు చెడ్డోడా ?

Update: 2018-03-16 13:07 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌హా ఆయా పార్టీ నేత‌లు త‌మ నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారే త‌ప్ప ప్ర‌జ‌లు త‌మ గురించి ఏమ‌నుకుంటారో అనే ఆలోచ‌న కూడా చేయ‌డం లేద‌ని వైఎస్ ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బీజేపీ - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో వైఎస్ జ‌గ‌న్ చేతులు క‌లిపిన‌ట్లు చేస్తున్న విమర్శలు టీడీపీ నాయ‌కుల ఆలోచ‌న తీరును చాటి చెప్తున్నాయ‌ని అన్నారు. బీజేపీతో జ‌గ‌న్ దోస్తీ క‌ట్టార‌నే టీడీపీ విమ‌ర్శ‌ల‌పై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇలాంటి విమర్శలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవేళ మోడీతో జతకడితే... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తామని రోజా సూటిగా నిల‌దీశారు.

ఆర్థిక నేర‌స్తుల‌నే పేరుతో టీడీపీ విమ‌ర్శ‌లు చిత్రంగా ఉంద‌ని రోజా అన్నారు. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని  పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేషేనని... వైఎస్ జగన్ కాదని అన్నారు. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ వెల్ల‌డించార‌ని అన్నారు. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు అని అన్నారని... ఇప్పుడు టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి ఆయన చెడ్డ వ్యక్తి అయ్యారా? అని ప్రశ్నించారు. చంద్ర‌బాబుకు చిత్త‌శుద్ధి ఉంటే త‌న మంత్రుల‌తో రాజీనామా చేయించిన రోజే ఎన్‌డీఏ నుంచి త‌ప్పుకునే వారు అన్నారు. ఇవాళ అవిశ్వాస తీర్మాన‌మ‌ని నాట‌కాలు ఆడుతున్నారని విమ‌ర్శించారు.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎక్క‌డ వైఎస్ఆర్‌ సీపీకి - వైయ‌స్ జ‌గ‌న్‌ కు మంచి పేరు వ‌స్తోందోన‌ని - వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి చంద్ర‌బాబు మ‌రోమారు ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు సిద్ధ‌మయ్యార‌ని రోజా మండిప‌డ్డారు. చంద్ర‌బాబు డ్రామాల‌ను ఎవ‌రు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని రోజా అన్నారు. బీజేపీతో వైఎస్ ఆర్‌ సీపీ క‌లుస్తోంద‌ని త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తూ టైం గ‌డిపే బ‌దులు...రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంపై పోరాటం చేయాల‌న్నారు.
Tags:    

Similar News