అచ్చెన్నాయుడు అరెస్ట్...రోజా కీలక వ్యాఖ్యలు !

Update: 2020-06-12 09:50 GMT
ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామ చోటుచేసుకుంది. ఎవ్వరు ఊహించని రీతిలో ఈఎస్ ‌ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో దాదాపు రూ.151 కోట్ల అవినీతి జరిగినట్లు తెలిపారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్ ‌పై నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా స్పందించారు. తప్పు చేశారే కాబట్టే మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిందని, చట్టం ముందు ఎవరైనా తలవంచక తప్పదు అని అన్నారు. ఆధారాలతో అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారని.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని విమర్శించారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదని రోజా విమర్శించారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని గతంలో తొడగొట్టిన లోకేశ్... సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఎందుకు మండిపడుతున్నాడని విమర్శించారు.

తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్న రోజా.. గత ప్రభుత్వ హాయాంలో అవినీతి జరిగినట్లు ప్రతీ అసెంబ్లీ సెక్షన్‌లోనూ సీఎం వైఎస్ జగన్ లెక్కలతో నిరూపించారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని గతంలోనే లోకేష్ ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నామని.. అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందని రోజా తెలిపారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడి అవినీతితో దొరికిపోయాడని... ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో జరిగిన అవినీతితో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా.. ఎవరైనా కూడా తప్పకుండా జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు.
Tags:    

Similar News