అయితే.. పార్టీని ఎత్తేద్దామా రాహుల్ స‌ర్‌!

Update: 2022-04-10 03:29 GMT
తాను అధికారంలోనే పుట్టానని, దానిపై తనకెప్పుడూ ఆసక్తి లేదని  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ప్రాచీన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ``మీకు ఆస‌క్తి లేదేమో.. మ‌రి మా మాటేంటి?`` అని కీల‌క నేత‌లు.. కేడ‌ర్ కూడా తీవ్ర‌స్థాయిలో ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. రాహుల్ ఏమ‌న్నారంటే.. ``నేను అధికారంలోనే పుట్టాను, దానిపై నాకెప్పుడూ ఆసక్తి లేదు.  కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఆధికారం కోసం తాపత్రయపడతూ ఉంటారు`` అని విమర్శించారు.ఇది ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి.. లేదా.. అధికార బీజేపీని ఉద్దేశించి ఆయ‌న చేసి ఉండొచ్చు. కానీ.. ఇదే మాట కాంగ్రెస్ కు కూడా వ‌ర్తిస్తుంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు.

తనకెన్నడూ అధికారంపై ఆసక్తి లేదని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాను పుట్టిందే అధికారం మధ్యలో అని అన్నారు. డిల్లీలో శనివారం 'ది దళిత్ ట్రూత్ అనే' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. యూపీ నేత మాయావతి, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు గుప్పించారు. "అధికారం కోసం పరితపించే రాజకీయ నాయకులున్నారు. వారెప్పుడూ దాని గురించే ఆరాట పడతారు. కానీ, నేను పుట్టిందే అధికారం మధ్య. నిజాయతీగా దానిపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. బదులుగా ఈ దేశాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను`` అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇటీవలే జరిగిన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ చీఫ్ మాయావతితో కూటమి కోసం ప్రయత్నించినట్లు చెప్పారు రాహుల్. ఆమెకు సీఎం పదవి ఆఫర్ చేయగా.. కనీసం మాట్లాడేందుకు నిరాకరించారని తెలిపారు. "మాయావతి.. ఎన్నికల పోరు చేయలేదు. కాంగ్రెస్ పై ప్రభావం పడినా.. యూపీలో దళితుల కోసం గొంతెత్తారు కాన్షీరాం. కానీ ఈసారి మాత్రం దళితుల కోసం మాయావతి నిలబడలేదు. బీజేపీకి ఆమె ఆమోదం తెలిపారు. కారణం.. సీబీఐ, ఈడీ, పెగాసస్!" అని రాహుల్ విమర్శించారు.

 రాజ్యాంగం.. భారత్కు ఆయుధమని, అయితే సంస్థలు లేనిదే దానికి అర్ధం లేదని రాహుల్ గాంధీ అన్నారు. "రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం గురించి మాట్లాడుతుంటాం. రాజ్యాంగం ఎలా అమలవుతుంది? సంస్థలతో! రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ముందు మన సంస్థలను రక్షించుకోవాలి. కానీ, అవన్నీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉన్నాయి." అని ఆరోపించారు రాహుల్.

అయితే.. రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు.. చిన్న‌బోతున్నారు. పార్టీ ఇప్ప‌టికే.. అన్ని విధాలా చితికిపోయింద‌ని.. ఇప్పుడు రాహుల్ మ‌రింత ఊపిరి తీసేస్తున్నారని అంటున్నారు. పార్టీలో తాము ఏళ్ల త‌ర‌బ‌డి.. ప‌నిచేస్తున్నామ‌ని.. ఆస్తులు కూడా ధార‌పోసి.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేశామ‌ని.. మ‌రి ప‌ద‌వులు మీకు అవ‌స‌రం లేదంటే.. మాకు కూడా అవ‌స‌రం లేదా?  పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. మాకు కూడా గుర్తింపు ల‌భిస్తుంద‌ని.. ఆశించామ‌ని.. కానీ.. ఇప్పుడు పూర్తిగా పుట్టిముంచేసే.. వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని .. అంటున్నారు. అధికారం అవ‌స‌రం లేద‌న్న‌ప్పుడు.. పార్టీ ఎందుకు ఎత్తేద్దామా?  అని కొంద‌రు తీవ్రంగానే స్పందిస్తున్నారు.
Tags:    

Similar News