యూపీలో ప్రియాంక దూకుడు ఫ‌లిత‌మిచ్చేనా?

Update: 2022-01-31 15:30 GMT
దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నిక‌లు అత్యంత కీల‌కం కానున్నాయి. వీటిలోనూ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు మ‌రింతగా రాజ‌కీయ పార్టీల‌కు, నేత‌ల‌కు కూడా ప్రాణ‌ప్ర‌దం అయ్యాయి. ఈ రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కినా.. లేక ఆశించిన మేర‌కు దూకుడు చూపించినా.. ఖ‌చ్చితంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీ కూడా యూపీపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది అమిత్ షా నుంచి అగ్ర‌నాయ‌కుల వ‌ర‌కు ఇక్క‌డ ప్ర‌చారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. అయితే.. కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి?  ఒక‌ప్పుడు యూపిని పాలించిన ఈ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనేది ఆస‌క్తిగా మారింది.

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ యూపీ నుంచే పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.. అయితే.. ఇక్క‌డ  ఆ పార్టీ మాత్రం దారుణ ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. సోనియా అనారోగ్యం కార‌ణంగా అస‌లు ఈ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, ఆమె త‌న‌యుడు, కీల‌క నేత రాహుల్ గాంధీ అస‌లు.. యూపీని మ‌రిచిపోయారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో యూపీలో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను భుజాన వేసుకున్న సోనియా త‌న‌య‌.. ప్రియాంక గాంధీపైనే ఇప్పుడు ఆ పార్టీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ.. ప్రియాంక మాత్రం ఎలాంటి వ్యూహం లేకుండా ముందుకు సాగుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌ధానంగా బీజేపీకి, ఎస్పీకి మ‌ధ్యే పోరు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ గురించి మాట్లాడే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. 2017లో ఎస్పీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌.. త‌ర్వాత‌.. ఆ పార్టీకి దూర‌మైంది. ఇప్పుడు.. ఒంట‌రి పోరు చేస్తోంది. అయితే.. వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలోను.. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోనూ ప్రియాంక విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తీసుకుంటే 2017 వరకు... మధ్యలో ఒకే ఒకసారి కాంగ్రెస్‌ ఓటు శాతం డబుల్‌ డిజిట్‌ 2012లో 11.63 శాతం ఓట్లు, 23 సీట్లు వచ్చాయి. 1996లో వచ్చిన 33 సీట్లే కాంగ్రెస్‌కు ఇప్పటిదాకా యూపీలో వచ్చిన అత్యధిక స్కోరు.  

ఉదారవాద హిందుత్వకు వారసులుగా తమను తాము చూపుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వను ఎదుర్కోవాలన్నది ప్రియాంక ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు రైతు చట్టాలపై నిరసనలు వ్యక్తమైన యూపీలో రైతులను ఒక ప్రత్యేక తరగతిగా భావించి, వారిని మచ్చిక చేసుకోవాలని ప్రియాంక పావులు కదుపుతున్నారు. ఈ కుల, మత, వర్గ సూత్రాలు కాంగ్రెస్‌ను కాపాడతాయా? ... అంటే ఉనికి కోసం పోరాడుతున్న పార్టీకి పునర్‌వైభవం సాధ్య‌మెలా? అనేది ప‌రిశీల‌కుల మాట‌.

ఇక‌, యూపీ విష‌యంలో ప్రియాంక గాంధీకి కూడా ప‌లు సందేహాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ  ఆమ‌లోనూ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. మాజీ కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు కంట్లో న‌లుసుల్లాగా మారిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ పోస్టర్‌ గర్ల్‌ ప్రియాంక మౌర్య బీజేపీలో చేరడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తల మీటింగుల్లో ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెసు పార్టీలో గాంధీ కుటుంబ వారసత్వానికి భవిష్యత్‌ లేదు. ఇకనైనా నాయకత్వం కళ్లు తెరిచి చూడాలి. లేదంటే తుడిచిపెట్టుకుపోతుంది’ అని గుర్మిత్‌ సింగ్‌ పూరి అన్నారు. ఖతులీ శాసనసభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న గుర్మిత్‌ గతంలో రాజీవ్‌ గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథి పార్లమెంట్‌ నియోజకవర్గంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశారు.  

బీజేపీ అనుసరించే హార్డ్‌కోర్‌ హిందుత్వను  చాలామంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇలాంటి వారిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో భాగంగా అటు ప్రియాంక, ఇటు రాహుల్‌ తమనుతాము ఉదారవాద హిందూవాదులుగా చూపించుకుంటున్నారు. అయితే.. పార్టీకి బేస్ పూర్తిగా క‌దిలిపోయిన నేప‌థ్యంలో ప్రియాంక ప్ర‌య‌త్నాలు.. కాంగ్రెస్‌కు ఏమేర‌కు ఫ‌లితాన్ని క‌ట్ట‌బెడతాయ‌నేది సందేహ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News