స్టేషన్ లో సీఐ.. ఎస్ ఐలను కొట్టిన జగన్ ముఖ్యమంత్రి.. పవన్ సంచలనం

Update: 2023-01-27 11:36 GMT
ఇప్పటివరకు ఎవరూ చేయని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఏపీ ముఖ్యమంత్రిగా.. వైసీపీ అధినేతగా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై కొత్త సందేహాలు కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం షాకింగ్ గా మారింది. మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ శ్రేణులతో మాట్లాడిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో సీఐ..ఎస్ఐలను కొట్టిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే నాయకుడన్నారు.

కోడి కత్తితో పొడిపించుకొని ఆంధ్రా పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పి.. తెలంగాణ వచ్చి ఒక ప్రఖ్యాత డాక్టర్ను కలిసి చికిత్స చేయించుకున్నాడా వ్యక్తి. 'ఆ రోజు తనకు వైద్యం చేసిన వైద్యుడికి ఆరోగ్య శ్రీ ట్రస్టు ఛైర్మన్ పదవి ఇచ్చిన గొప్ప నాయకుడు. పోలీసులు సెల్యూట్ చేసే నాయకుడికి ఆంధ్ర పోలీస్ మీదనే నమ్మకం లేదని ప్రకటించిన వ్యక్తి అనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి. బాబాయ్ ను చంపి గుండెపోటు అని.. కోడి కత్తితో పొడిపించుకొని పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పే వ్యక్తిని నేను మాత్రం కాదు'' అని మండిపడ్డారు.
Read more!

ఏపీ భవిష్యత్తు కోసం జనసేన రాజకీయ వ్యూహాలు ఉంటాయని.. అదెలాంటి వ్యూహమైనా తనకు వదిలేయాలని.. కచ్ఛితంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాల్ని తాను రచిస్తానని చెప్పారు. రాత్రికి తోడు వేస్తే.. ఉదయం నాటికి పెరుగుగా మారుతుంది. ప్రతి దానికి సమయం కావాలని.. అలాంటిది గొప్ప ఆశయంతో పెట్టిన పార్టీ నిర్మాణం అంత తేలికైనది కాదన్నారు.

ఒకే ఆశయంతో ఉన్న బలమైన వ్యక్తుల సమూహం కావాలని.. లేడికి లేచిందే పరుగులా తాను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని అయిపోవాలని పార్టీ పెట్టలేదన్నారు. 'ఒక్కోటి మెల్లగా జరుగుతుంది. మీరు మీ పని నిజాయితీగా చేసుకొని ముందుకు వెళ్లండి. నా కుటుంబాన్ని వదిలేసి ప్రజలే కుటుంబంగా భావించి వచ్చా. జీవితాంతం ప్రజల కోసం ఒక కూలీగా మారి పని చేయటానికి సిద్ధంగా ఉన్నా'' అని స్పష్టం చేశారు.

తాను ఎక్కడికి వెళ్లనని.. పెద్ద అపజయం వచ్చినా బలంగా నిలబడిన వాళ్లమని.. ఏపీ ప్రజల వెన్నంటి ఉంటానని చెప్పారు.  చాలామంది తనను చాలా రకాలుగా మాట్లాడతారంటూ వారి మాటలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్. ''ఒకసారి కమ్యూనిస్టు అంటాడు. మరోసారి మార్కిస్టు అంటాడు. పవన్ కల్యాణ్ కు నిలకడ లేదని మాట్లాడిన వారు ఉన్నారు. ముందుగా నేను మానవతావాదిని. నా ప్రజల అవసరాల కోసం మారే మధ్యస్థవాదిని. నాకు ప్రత్యేక ఎజెండాలు ఏమీ లేవు.
4

ప్రజలే ఎజెండాగా తిరిగేవాడిని. నాది ఐదేళ్లకు ఒకసారి మారే ఎన్నికల ఐడియాలజీ కాదు. వచ్చే భావితరాల కోసం ఆలోచించే పాతికేళ్ల ఐడియాలజీ. సంఖ్యాబలం లేని అణగారిన కులాలకు బలంగా నిలబడాలని భావించి.. ఆలోచించే వ్యక్తిని. రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడినా పెద్దగా పట్టించుకోను'' అంటూ తనను విమర్శించే వారికి సమాధానం ఇచ్చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News