టీఆరెస్ ఎమ్మెల్యే హోటళ్లో పవన్ బస

Update: 2018-01-22 16:39 GMT
   
తెలంగాణలో తన యాత్ర ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసి యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తలు - అభిమానులతో కరీంనగర్‌ లో సమావేశం కానున్నారు. కాగా.. పవన్ సోమవారం రాత్రి కరీంనగర్ లోని ఒక హోటళ్లో బస చేస్తున్నారు. ఇందులో వింతేమీ లేకపోయినా - ఆ హోటల్ ఒక టీఆరెస్ ఎమ్మెల్యేది కావడమే విశేషం.
    
కరీంనగర్‌ లో పవన్ హోటల్ శ్వేతాలో బస చేస్తున్నారు. కరీంనగర్ ఆర్టీస్ బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఈ విలాసవంతమైన హోటల్ యజమాని టీఆరెస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. టీఆరెస్ ఎమ్మెల్యేకు చెందిన హోటల్‌ లో జనసేన అధినేత బస చేయడం కాకతాళీయమే కావొచ్చు కానీ... ఆయన కేసీఆర్‌ కు మద్దతుగా తెలంగాణలో ప్రచారం ప్రారంభిస్తున్నారంటూ వస్తున్న విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది.
    
సుదీర్ఘకాలంగా టీడీపీలో పనిచేసిన గంగుల ఆ పార్టీ నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీఆరెస్‌ లో చేరి మరోసారి గెలిచారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన కమలాకర్‌ కు చెందిన హోటళ్లో పవన్ బస చేస్తుండడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పవన్ పర్యటనలకు టీఆరెస్ ఏర్పాట్లు చేస్తోందన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News