మ‌హాకూట‌మి కామెడీషో అవుతోందే!

Update: 2018-10-21 05:59 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌తిపక్షాల‌ పాత్ర గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఐక్యంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జాగ‌ళాన్ని బ‌లంగా వినిపించ‌లేక‌పోయిన విప‌క్షాలు అనంత‌రం కూట‌మి పేరుతో జ‌ట్టుక‌ట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ రద్దు కంటే ముందు నుంచే చర్చల్లో నలిగిన ‘మహాకూటమి’ ఏర్పాటు వ్యవహారం నెలలు గడుస్తున్నా ఒక కొలిక్కి రాలేదు. కూటమి ఉనికిలోకి రావడం అనుమానమేననే అభిప్రాయాలు భాగస్వామ్య పార్టీల నుంచే వ్యక్తమవుతున్నాయి. సీపీఐ - తెలంగాణ జన సమితి పార్టీలు ఎవరి దారి వారిదే అనే రీతిలో సిగ్న‌ల్స్ ఇస్తున్నాయి. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోతే స్వంతంగా తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఈ రెండు పార్టీలూ వ్యాఖ్యానించడంతో కూట‌మి పెద్ద కామెడీ షో అవుతోంద‌ని ప్ర‌త్య‌ర్థి శిబిరాలు సెటైర్లు వేస్తున్నాయి.

రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకోవాలని చాలా కాలం కిందటే ఒక పరస్పర అవగాహనకు వచ్చినా మరికొన్ని పార్టీలను కలుపుకుపోవడం ద్వారా కూటమి బలంగా ఉంటుందని భావించాయి. అనంత‌రం సీపీఐ - తెలంగాణ జనసమితి కూడా భాగస్వామ్య పార్టీలుగా ముందుకొచ్చాయి. కానీ చివరకు సీట్ల సర్దుబాటు దగ్గరకు వచ్చేసరికి సిపిఐ - టిజెస్ పార్టీలకు మూడు లేదా నాలుగుకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం సమంజసం కాదని భావించిన కాంగ్రెస్ అదే విషయాన్ని సమావేశాల్లో వ్యక్తం చేసింది. అయితే ఆ రెండు పార్టీలూ తీవ్ర అసమ్మతి తెలియజేయడంతో సీట్ల సంఖ్య - సర్దుబాటు దగ్గర ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల సర్దుబాటుపై - పొత్తులపై కాంగ్రెస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకో కుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తుండటంతో భాగస్వామ్య పార్టీల్లో అసహనం రోజురోజుకూ పెరుగుతోంది. ఒక దశలో రెండు రోజుల డెడ్‌ లైన్‌ ను విధించిన తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్వంత నిర్ణయం తీసుకోడానికి సిద్ధమవుతున్న గంటల వ్యవధిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సంకేతం ఆధారంగా మరో రెండు రోజులు వేచి చూస్తానని ప్రకటన చేశారు. అయిన‌ప్పటికీ అది కొలిక్కి రాలేదు. వేరు కుంపటి పెట్టుకోక తప్పదని ఈ రెండు పార్టీల నేతలూ మీడియా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు ఈ రెండు పార్టీలు కూటమిలో భాగస్వాములు అవుతాయా అనే సందేహం కూడా లేకపోలేదని కొంద‌రు అంటున్నారు.

వ‌చ్చేవారంలో కూట‌మిపై ఓ స్ప‌ష్ట‌త రావ‌చ్చున‌ని అంటున్నారు. ఈ స‌మ‌యాన‌క‌ల్లా కూటమి ఒక కొలిక్కి రాకపోతే సీపీఐ - టీజేఎస్‌ లు వేరుకుంపటి పెట్టుకోక తప్పేలా లేదనే భావ‌న సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది. కోదండరాం విధించిన రెండు రోజుల గడువు ముగియనున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి కూటమి సీట్ల‌పై స్పష్టత రానిపక్షంలో సీపీఐ - టీజేఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News