ఓర్నీ.. 'ఉల్లి' పేరు చెప్పుకొని బతికేస్తున్నారు

Update: 2015-09-04 06:57 GMT
పోకిరి సినిమాలో హీరో చెప్పినట్లు.. మీ ఫ్యామిలీ.. ఫ్యామిలీ మొత్తం ఉప్మా మీద బతికేస్తుందే అన్నట్లుగా.. ఇప్పుడు వ్యాపార సంస్థల్లో ఎక్కువ మంది ఉల్లిపాయల మీద బతికేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల నిత్యావసర వస్తువైన ఉల్లిపాయ ధర కొండకెక్కి కూర్చోవటం.. విపణిలో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.80 మధ్య పలుకుతున్న నేపథ్యంలో.. ఉల్లి పేరు చెప్పేసి తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవటం.. వీలైనంత ప్రచారం చేసుకోవటం ఒక ట్రెండ్ గా మారింది.

ఇప్పటికే తమ సిమ్ కార్డు తీసుకుంటే కిలో ఉల్లి ఫ్రీ అంటూ ఊరించిన టెలికం సంస్థలతో పాటు.. ఉల్లిపాయలు ఉచితం అంటూ చాలామంది చాలానే ఆఫర్లు పెట్టేస్తున్నారు. ఈ ట్రెండ్ ను గుర్తించి.. ఒక మొబైల్ యాప్ కూడా ఉల్లిపాయ మీద ఎన్నో ఆశలు పెట్టేసుకొని.. ప్రచారం మొదలు పెట్టింది. బెంగళూరుకు చెందిన ''నింజా కార్ట్'' అనే ఆన్ లైన్ గ్రోసరీ సంస్థ (ఆన్ లైన్ బుకింగ్ ద్వారా నిత్యవసరాల్ని డెలివరీ చేయటం) బెంగళూరు వాసుల్ని ఆకట్టుకునేందుకు ఉల్లి ఆసరా తీసుకుంది. మార్కెట్లో మండిపోతున్న ఉల్లిపాయల్ని కేవలం రూపాయికే అందిస్తామని చెబుతోంది.

అంత చౌకగానా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలిన ఆఫర్ల మాదిరే ఈ బంపర్ ఆఫర్ కు షరతులు వర్తిస్తాయి. తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. వస్తువులు కొంటే.. రూపాయికి కిలో ఉల్లిపాయలు ఇస్తామని వెల్లడించి అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి వాణిజ్య సంస్థలు తమ ప్రచారానికి ''ఉల్లి''ని బాగానే వాడేస్తున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News