హిరోషిమాలో మ‌న‌సు గెలిచిన ఒబామా

Update: 2016-05-27 16:10 GMT
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మ‌రోమారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించిన సంఘ‌ట‌న‌పై త‌న‌దైన శైలిలో స్పందించి మాన‌వాళి మ‌న‌సు గెలుచుకున్నారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఒబామా హిరోషిమా స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించారు. 1945   ఆగస్టు 6న అణు బాంబు పడిన చోటుకు చేరుకున్న ఒబామా అక్క‌డ ఉన్న హిరోషిమా స్మారక స్థూపం వ‌ద్ద అంజ‌లి ఘ‌టించారు. ఆ తర్వాత అమ‌రుల ఆత్మ‌శాంతికి మౌనం పాటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబు దాడి చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించిన తొలి అమెరికా అధ్య‌క్షుడు ఒబామానే కావ‌డం విశేషం. అణు దాడి వల్ల హిరోషిమాలో 1,40,000 మంది మరణించారు.

ఈ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఒబామా హృద‌యాన్ని అత్తుకునే ప్ర‌సంగం చేశారు. బాంబు దాడి జరిగిన ఘటనను కేవలం మాటలతో వర్ణించలేమ‌ని ఆ నాటి గుర్తులు మనతో ఉండిపోతాయని అన్నారు. ఆ దురదృష్టకరమైన సంఘటన నుంచి ఆ ఆలోచనలే మనకు ఆశను నింపాలని ఒబామా ఆకాంక్షించారు. నిరంతర ప్రయత్నం వల్ల చేదు జ్ఞాపకాలను మరిచిపోవచ్చున‌ని పేర్కొంటూ క్రూరత్వం లేని సమాజాన్ని సృష్టించవచ్చని తెలిపారు. శాంతి ఎంతో విలువైందని ఒబామా అన్నారు. జపాన్, అమెరికా మిత్రదేశాలే కాదని, ఇప్పుడు తమ మధ్య స్నేహం ఉందన్నారు. జపాన్ ప్రధాని షింజో అబే కూడా ఒబామాతో పాటు నివాళి అర్పించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ హిరోషిమాలో ఒబామా పర్యటించడం చరిత్రాత్మకమని అన్నారు. ప్రపంచ ప్రజలు అణ్వస్త్ర రహిత సమాజాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
Tags:    

Similar News