ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఉమెన్సు కాలేజి..

Update: 2016-04-26 06:05 GMT
హైదరాబాద్‌ లోని ఎన్‌ టిఆర్ ట్రస్టు భవన్‌ లో ఇకపై అమ్మాయిలు పాఠాలు నేర్చుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అనగానే వారంతా రాజకీయ పాఠాలు నేర్చుకుంటారేమో అనుకోవద్దు... సాధారణ కళాశాల విద్యనే అభ్యసించబోతున్నారు. అక్కడ ఉమెన్సు కాలేజి ఏర్పాటు చేస్తుండడమే అందుకు కారణం.  వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభం కానుంది.

ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎన్‌ టిఆర్ ట్రస్టు భవన్ రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతుంది. చంద్రబాబు ఏపీ కేంద్రంగా పాలన సాగిస్తుండడం... లోకేశ్ కూడా విజయవాడలోనే ఎక్కువ రోజులు ఉంటుండడంతో ట్రస్టు భవన్ చిన్నబోతోంది.   1996లో ట్రస్ట్ భవన్ నిర్మాణం మొదలైనప్పటి నుంచి 2014లో ఎన్నికలు జరిగేంత వరకూ ట్రస్ట్‌ భవన్‌ లో కార్యకలాపాలు ప్రతిరోజూ ఉండేవి. నిత్యం నేతల రాకపోకలతో కళకళలాడేది.  2014 ఎన్నికల్లో టిడిపి తెలంగాణాలో దెబ్బతిన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి రావటంతో కొన్నాళ్ళపాటు పార్టీ కార్యకలాపాలు బాగానే జరిగాయి. చంద్రబాబునాయడు ఏపికి ముఖ్యమంత్రే అయినా రాజధాని లేనికారణంగానే హైదరాబాద్ నుండే పరిపాలనా సాగించేవారు. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిందో అప్పటి నుండి ట్రస్ట్‌ భవన్‌ కు గ్రహణం పట్టుకుందనే చెప్పాలి. సదరు కేసులో చంద్రబాబునాయడు పాత్రపైనే ఆరోపణలు రావటంతో ఇటు చంద్రబాబునాయడుకి అటు పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో హైదరాబాద్‌ లో ఉండటం క్షేమం కాదని భావించిన చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలను విజయవాడకు తరలించారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాలాను కూడా క్రమక్రమంగా హైదరాబాద్ నుండి విజయవాడ - గుంటూరుకు తరలిస్తున్నారు.

చంద్రబాబు విజయవాడలో ఉంటుండడంతో తెలంగాణాలోని నేతలందరూ ఇపుడు విజయవాడకే వెళుతున్నారు. తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవటానికి చంద్రబాబు కనీసం వారానికి నాలుగు రోజులైనా ట్రస్ట్ భవన్‌ కు రావాల్సిందేనంటూ తెలంగాణాలోని టిడిపి నేతలు ఎంత పట్టు బట్టినా ఇక్కడకు రావటానికి చంద్రబాబు ఇష్టపడలేదు.ఈ నేపధ్యంలో ట్రస్ట్‌ భవన్‌ లో పార్టీ కార్యకలాపాలు చాలా వరకూ తగ్గుముఖంపట్టాయి. దాంతో ఒకపుడు ప్రతీరోజూ కళకళలాడిన ట్రస్ట్‌ భవన్ ఇపుడు దాదాపు బోసిపోయింది. పార్టీ కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా ఎంత కాలం నెట్టుకురావాలన్నది పెద్ద సమస్యగా తయారైంది. కనీసం ట్రస్ట్‌ భవన్ నిర్వహణకు సరిపడా నిధులైనా నెలవారీగా వస్తే చాలనుకునే పరిస్దితికి వచ్చేసింది. పార్టీ కార్యకాలాపాలు కాకుండా ప్రస్తుతం ట్రస్ట్‌ భవన్‌ లో ఎన్‌ టిఆర్ బ్లడ్ బ్యాంకు నిర్వహణ - ఎన్‌ టిఆర్ మోడల్ స్కూల్ కేంద్ర కార్యాలయం - వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వటానికి అవసరమైన మెటీరియల్ తయారు చేయటం లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి.  ఇపుడు జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ ఒకే భవనంలోకి మార్చేసి రెండో భవనంలో కొద్ది పాటి మార్పులు చేస్తే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటానికి అనువుగా ఉంటుందని ట్రస్ట్‌ భవన్ వర్గాలు సూచించినట్లు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇది మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News