జ‌గ‌న్‌ కు ఉన్నంత ద‌మ్ము... బీజేపీకి లేదబ్బా

Update: 2019-06-17 10:28 GMT
వైసీపీ అధినేత‌, న‌వ్యాంధ్ర‌కు నూత‌న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిజంగా ద‌మ్మున్న నేతే. పార్టీ ఫిరాయింపుల‌కు తాను వ్య‌తిరేక‌మంటూ చెబుతూ వ‌స్తున్న జ‌గ‌న్‌... ఆది నుంచి అదే బాట‌లో న‌డుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వచ్చి వైసీపీ పేరిట కొత్త పార్టీ పెట్టిన నాడు కూడా త‌న పార్టీలోకి వ‌స్తున్న నేత‌లతో ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయించిన త‌ర్వాతే ఆహ్వానించారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎక్క‌డా క‌ట్టుత‌ప్ప‌డం లేదు. పార్టీ ఫిరాయింపుల‌ను రాష్ట్రంలోనే కాకుండా యావ‌త్తు దేశంలో ఎక్క‌డా చోటుచేసుకోకుండా ఓ కొత్త సంస్కృతికి శ్రీకారం చుడ‌దామంటూ అసెంబ్లీ తొలి సెష‌న్ లోనే చెప్పిన తీరు నిజంగానే జ‌గ‌న్ ను హీరోను చేసేసింద‌ని చెప్పాలి.

ఈ విష‌యంలో జ‌గ‌న్ చూపిస్తున్న ద‌మ్ము... రాష్ట్రంలోని పార్టీల‌కే కాకుండా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఏ ఒక్క పార్టీకి లేద‌నే చెప్పాలి. తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ మాదిరే కేంద్రంలో బంప‌ర్ మెజారిటీతో సత్తా చాటిన బీజేపీ కూడా జ‌గ‌న్ ముందు దిగ‌దుడుపేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ ఫిరాయింపుల విష‌యంలో జ‌గ‌న్ చూపిస్తున్న తెగువ‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో కూడా క‌నిపించే దాఖ‌లాలు లేవ‌న్న రీతిలో ఇప్పుడు కొత్త విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడు ఈ విశ్లేష‌ణ ఎందుకన్న విష‌యానికి వ‌స్తే... తాజా ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఏకంగా నాలుగు సీట్ల‌ను సాధించిన బీజేపీ... ఆ రాష్ట్రంలో మ‌రింత‌గా బ‌ల‌ప‌డేందుకు ప‌క్కా ప్లాన్ ర‌చించింది.

ఇప్ప‌టికే ఈ ప్లాన్ ను ఆ పార్టీ రంగంలోకి దించేస్తే... కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మైపోయారు. ఈ క్ర‌మంలో మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ తెలంగాణ చీఫ్ ల‌క్ష్మ‌ణ్‌... ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీడీపీ నేత‌ల‌తో పాటు టీఆర్ ఎస్ కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియా నుంచి ఆయ‌న‌కు ఊహించ‌ని ఓ ప్ర‌శ్న‌ ఎదురైంది.

ఇత‌ర పార్టీల నేత‌ల‌ను బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు క‌దా... మ‌రి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న నేత‌లు బీజేపీలోకి వ‌స్తే... వారితో ప‌ద‌వులకు రాజీనామాలు చేయిస్తారా? అని మీడియా ప్ర‌తినిధులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న వినిపించ‌గానే షాక్ తిన్న‌వాడికి మ‌ల్లే కంగారుప‌డిపోయిన ల‌క్ష్మ‌ణ్‌... ఆ విష‌యాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంద‌ని, అధిష్ఠానం నిర్ణ‌యానికి అనుగుణంగానే తాము వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పుకొచ్చారు. అంటే... త‌మ పార్టీలోకి వ‌చ్చే వారితో ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయించే ప్ర‌సక్తే లేద‌ని ల‌క్ష్మ‌ణ్ తేల్చేసిన‌ట్టే క‌దా. మ‌రి ఈ విష‌యంలో ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి వ‌స్తేనే ఎంట్రీ అంటూ సాగుతున్న జ‌గ‌న్ ద‌మ్ము ముందు బీజేపీ నేత‌లు తేలిపోయినట్టే క‌దా.

    

Tags:    

Similar News