450 కిలోల ఇరాన్ యురేనియం కోసం ట్రంప్ వ్యూహం.. వేలాది సైనికులతో రహస్య ప్రణాళిక!
ఇలాంటి ఆపరేషన్ అమలు చేయడానికి కనీసం కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని మధ్యలో సైనిక ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.;
ఇరాన్ వద్ద నిల్వలో ఉన్న సుమారు 450 కిలోల అధిక శుద్ధి యురేనియం చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు మళ్లీ ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈ కీలక అణు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం పలు వ్యూహాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
గతంలో ఇరాన్ అణుస్థావరాలపై జరిగిన దాడుల అనంతరం.. ఇస్ఫహాన్, నతాంజ్ వంటి ప్రధాన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటనల తర్వాత అక్కడ నిల్వలో ఉన్న యురేనియం ఆచూకీ స్పష్టంగా లభించకపోవడం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 60 శాతం వరకు శుద్ధి చేసిన ఈ యురేనియం శిథిలాల కింద దాగి ఉండొచ్చని అమెరికా అంచనా వేస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఆ యురేనియాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైన్యం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్లో భాగంగా వేలాది మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులను ఇరాన్కు పంపాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా భారీ పరికరాలు, తవ్వక యంత్రాలను వాయుమార్గంలో తరలించాల్సి ఉంటుంది.
అత్యంత కీలకంగా యురేనియం తరలింపుకు ప్రత్యేక కార్గో విమానాలు అవసరమవుతాయి. అందుకోసం నతాంజ్ వంటి అణుస్థావరాల సమీపంలో తాత్కాలిక రన్వే నిర్మాణం చేయాల్సి ఉంటుందని మిలిటరీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇది సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ మాత్రమే కాకుండా భద్రత పరంగా కూడా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఆపరేషన్ అమలు చేయడానికి కనీసం కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని మధ్యలో సైనిక ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని కూడా వారు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొంతమంది అణు నిపుణులు.. మాజీ సైనికాధికారులు ఒక ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కింద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో యురేనియంను సురక్షితంగా వెలికితీసే ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ మిలిటరీ ప్రణాళికపై వైట్హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లివిట్ స్పందిస్తూ ఇది కేవలం ఒక ఆప్షన్గా మాత్రమే అధ్యక్షుడి ముందు ఉంచిన ప్రణాళిక అని స్పష్టం చేశారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అయితే ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు గురిచేస్తున్నాయి. అవసరమైతే ఇరాన్పై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.