మంత్రిగా ఉంటూనే టీవీ షోలు చేస్తాడట

Update: 2017-03-23 07:40 GMT
నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆటగాడిగా కంటే వ్యాఖ్యాతగా.. టీవీ షోల్లో జడ్జిగా బాగా పాపులర్. క్రికెట్ కెరీర్లో ఉన్నంత కాలం మౌన మునిలా ఉన్న సిద్ధు.. ఆ తర్వాత మాత్రం శైలి మార్చారు. చాలా చలాకీగా తయారయ్యారు. సెన్సేషనల్ కామెంట్లతో మంచి పాపులారిటీ సంపాదించారు. క్రికెట్ వ్యాఖ్యాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సిద్ధూ.. టీవీ రియాల్టీ షోలతో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. ఐతే తనకంత గుర్తింపు తెచ్చిన టీవీ షోలను మంత్రి అయ్యాక కూడా వదలనంటున్నాడు సిద్ధు. ఇటీవలే ముగిసిన పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలవడంతో సిద్ధుది కూడా కీలక పాత్ర. అందుకే ఆయనకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంత్రి వర్గంలో కూడా చోటు కల్పించాడు.

ఐతే మంత్రిగా ప్రమాణం చేశాక కూడా తాను టీవీ షోల్లో కొనసాగాలనుకుంటున్నట్లు సిద్ధు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ టీవీ షోలు చేస్తుండగానే తాను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచానని.. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు తాను ఆ షోలు మానేయాలని సిద్ధు ప్రశ్నిస్తున్నాడు. కపిల్ శర్మ కామెడీ షోలో తాను కొనసాగాలనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు. ఐతే ఇలా టీవీ షోలు చేసుకుంటూ మంత్రి పదవికి న్యాయం చేయగలరా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తే సిద్ధుకు కోపం వచ్చింది. ప్రజలకు లేని అభ్యంతరం మీకేంటి అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనకు ఒత్తిడి లేని మంత్రి పదవి ఇవ్వాలని సీఎంకు ఆయన కోరుతున్నారు. ఐతే మంత్రిగా ఉంటూ టీవీ షోలు చేయొచ్చా లేదా అన్నది తాను చెప్పలేనని.. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని అమరీందర్ చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News