దేశం మాట: హనుమంతప్ప.. కోలుకో అప్పా

Update: 2016-02-09 16:00 GMT
సియాచిన్ మంచు చెరియల్లో చిక్కుకొని.. 35 అడుగుల లోతులో ఆరు రోజులు ఉండిపోయినా.. చిరంజీవిలా బయటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప కోసం దేశం మొత్తం కదిలిపోతోంది. అతగాడి ఉదంతం విన్న వారంతా అతడు కోలుకోవాలని కోరుకుంటున్నారు. లక్కీగా బయటపడినప్పటికీ.. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బీపీ పడిపోవటం.. కిడ్నీ.. లివర్ పాడైపోయిన నేపథ్యంలో అతన్ని బతికించేందుకు వైద్యులు తాము చేయగలిగిన అన్నీ పనులు చేస్తున్నారు.

48 గంటలు గడిస్తే తప్పించి.. అతని గురించి ఎలాంటి భరోసా ఇవ్వలేమని వైద్యులు చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన హనుంతప్ప ఆరోగ్యంతో కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మరోవైపు.. హనుమంతప్ప సంగతి గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ.. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక సైనికుడి కోసం దేశ ప్రధానే స్వయంగా కదిలి వెళ్లిన తర్వాత అతని కోసం వైద్యులు ఎంతగా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ.. హనుమంతప్పకు కావాల్సింది అందరి ఆశీస్సులు. అందరం అతను కోలుకోవాలని ప్రార్ధిద్దాం.
Tags:    

Similar News