ప్ర‌క్షాళన‌కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చిన మోడీకి హేట్సాఫ్‌!

Update: 2018-10-25 05:06 GMT
సీబీఐ అంటే అదోలాంటి భ‌యం.. అంత‌కు మించిన భ‌క్తి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఉంటుంద‌న్న న‌మ్మ‌కం. తాజాగా ప్ర‌ధాని మోడీ పుణ్య‌మా అని అలాంటి న‌మ్మ‌కాల్ని క‌ట్ట క‌ట్టి మీకు ద‌గ్గ‌ర్లో స‌ముద్రం ఉంటే దాన్నో విసిరి కొట్టొచ్చు. లేదంటే.. కృష్ణ‌.. గోదావ‌రి.. పెన్నా.. తుంగ‌భ‌ద్ర‌..హుస్సేన్ సాగ‌ర్ ఇలా ఏ న‌ది ఉంటే దాన్లోకి నిక్షేపంగా ప‌డేయొచ్చు. సీబీఐకి చెందిన కీల‌క అధికారుల మ‌ధ్య నెల‌కొన్న అధిప‌త్య పోరు పీక్స్ కు చేరింద‌న్న మాట‌తో.. అలాంటి తీరును తాము స‌హించేది లేదంటూ ప్ర‌క్షాళ‌న పేరుతో అర్థ‌రాత్రి హైడ్రామా తీరు చూస్తే.. వ్య‌వ‌స్థ‌లు భ్ర‌ష్టు ప‌ట్ట‌టం అంటే ఏమిటో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

ఓకే.. మోడీ స‌ర్కారు చెప్పిన‌ట్లుగా సీబీఐలో వ్య‌వ‌స్థ‌లు భ్ర‌ష్ఠు ప‌ట్టాయ‌నే అనుకుందాం. దానికి ఒక ప్రొసీజ‌ర్ ప్ర‌కారం నిర్ణ‌యాలు తీసుకొని అమ‌లు చేయొచ్చుగా. అలా కాకుండా.. కీల‌క అధికారులు త‌మ విధులు ముగించుకొని ఇళ్ల‌కు వెళ్లిపోయాక‌.. సీబీఐ ఆఫీసులో ఉద్యోగులంతా వెళ్లిన త‌ర్వాత ఆప‌రేష‌న్ ప్ర‌క్షాళ‌న షురూ కావ‌టం ఏమిటి?మ‌ంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి వేళ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ పీఎంవోలోని ముఖ్య‌మైన అధికారుల్ని పిలిపించుకొని అలోక్ వ‌ర్మ‌.. రాకేశ్ అస్థానాల‌ను సెల‌వుపై పంపే ఉత్త‌ర్వులు త‌యారు చేయించ‌టం ఒక ఎత్తు అయితే.. అదే స‌మ‌యంలో లోధీ రోడ్ లో ఉన్న సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని పోలీసులు చుట్టుముట్ట‌టం మ‌రో ఎత్తు. సీబీఐ సీనియ‌ర్ అధికారుల్ని మార్చాల‌న్న నిర్ణ‌యానికి.. సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యం చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల్ని ప‌హారా కాయాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఎంత‌కూ దొర‌క‌ని ప‌రిస్థితి.

మ‌రో కీల‌కాంశం ఏమంటే.. మీడియాతో స‌హా దేశ ప్ర‌జ‌లంతా గాఢ నిద్ర‌లో ఉన్న వేళ‌లో ప్ర‌క్షాళన కార్య‌క్ర‌మంలోని కీల‌క అంశం షురూ కావ‌టం.  అర్థ‌రాత్రి 1.45 గంట‌ల వేళ‌లో సీబీఐకి కొత్త బాస్ గా నియ‌మితులైన మ‌న్నెం నాగేశ్వ‌ర‌రావు హడావుడిగా సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యానికి వ‌చ్చి విధుల్లో చేరారు.

అదేస‌మ‌యంలో అస్థానా అవినీతి మీద విచార‌ణ జ‌రుపుతున్న 13 మంది సీబీఐ అధికారుల‌పై బ‌దిలీ వేటు ప‌డింది. ఈ వేటు తీవ్ర‌త ఎంత ఎక్కువంటే తంతే అండ‌మాన్ లో ప‌డ‌తావ్ అంటూ సామాన్యుల నోట త‌ర‌చూ వ‌చ్చే మాట‌ను మోడీ స‌ర్కారు త‌న చేత‌ల్లో చేసి చూపించింది.

అస్థానా అవినీతి ఆరోప‌ణ‌ల‌పై విచారిస్తోన్న ద‌ర్యాప్తు డిప్యూటీ ఎస్సీ ఏకే బ‌స్సీని పోర్ట్ బ్లెయిర్ కు తోసేసింది. ప్ర‌క్షాళ‌న అంత‌టితో ఆగ‌లేదు. కొత్త టీం సీన్లోకి వ‌చ్చి.. రాఫెల్ డీల్ పై బీజేపీ పాత నేత‌లు అరుణ్ శౌరీ త‌దిత‌రులు ఇచ్చిన ఫిర్యాదును ప‌రిశీలించేందుకు అలోక్ ను సెల‌వుపై పంప‌ట‌మే కాదు.. మ‌ళ్లీ ఆఫీసు ఛాయ‌ల‌కు రాకుండా పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేసింది. అంతేనా.. అర్థ‌రాత్రి సీబీఐ బాస్ గా విధులు చేప‌ట్టిన మ‌న్నెం.. అర్థ‌రాత్రి నుంచే సెల‌వుపై వెళ్లిన సీబీఐ కీల‌క అధికారుల ఛాంబ‌ర్ల‌ను క్షుణ్ణంగా సోదాలు నిర్వ‌హించింది.

ఆ సోదాలు ఉద‌యం వ‌ర‌కూ సాగాయి. ఈ టైంలో విధుల్ని నిర్వ‌హించేందుకు వ‌చ్చిన సీబీఐ సిబ్బందిని.. ఇవాల్టికి ప‌ని లేదు.. మ‌ధ్యాహ్నం ఆఫీసుకు రండి అంటూ తిప్పి పంపారు. అంతేనా.. అస్థానా.. అలోక్ ఛాంబ‌ర్ల‌ను సోదాలు నిర్వ‌హించే స‌మ‌యంలో సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలోకి ఎవ‌రిని అనుమ‌తించ‌క‌పోగా.. సోదాలు మొత్తంగా పూర్తి అయ్యాక.. ప్ర‌క్షాళన పూర్తిగా అయిపోయింద‌న్న త‌ర్వాత రెండు ఛాంబ‌ర్ల‌ను సీజ్ చేసేశారు.

అర్థ‌రాత్రి రెండు గంట‌ల త‌ర్వాత మొద‌లైన ప్ర‌క్షాళ‌న ఉద‌యం వ‌ర‌కూ కొన‌సాగింది. అర్థ‌రాత్రి విధుల్లోకి చేరిన మ‌న్నెం త‌న ఎంట్రీతోనే సంచ‌ల‌నం సృష్టిస్తే.. త‌న విధుల నిర్వ‌హ‌ణ‌ను షురూ చేసిన టైమింగ్ చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌టం ఖాయం. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత మొద‌లైన ఆయ‌న విధి నిర్వ‌హ‌ణ బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కూ కొన‌సాగింది. ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం ప‌క‌డ్బందీగా సాగింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 2 గంట‌ల‌కు మొద‌లై బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కూ సాగింది.

ఇది జ‌రిగినంతసేపు సీబీఐ బాస్ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే ఉండిపోయారు. కునుకు తీయ‌కుండా జాగ్ర‌త్త‌గా ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యంగా పూర్తి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అనంత‌రం ఆయ‌న ఇంటికి వెళ్లారు. మ‌రి కాసేప‌టికే మ‌ళ్లీ వ‌చ్చి విధుల‌కు హాజ‌ర‌య్యారు. ఏది ఏమైనా ఒక ప్ర‌భుత్వ సంస్థ‌లో ప్ర‌క్షాళ‌న అన్న‌ది చేయాల్సి వ‌స్తే ఎంత ప‌క‌డ్బందీగా చేయొచ్చ‌న్న విష‌యాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కు మోడీ స‌ర్కారు చేత‌ల్లో చేసి మ‌రీ చూపించింద‌ని చెప్పాలి. ఏమైనా.. ఇలాంటివి ద‌మ్మున్న మోడీ స‌ర్కారుకు మాత్ర‌మే సాధ్యం.
Tags:    

Similar News