గెలిస్తే ఇదే ముందు చేస్తానన్న నాగబాబు

Update: 2019-04-15 05:49 GMT
ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది.. పోలింగ్ పూర్తయ్యింది. నేతలంతా ఫ్రీ అయ్యారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, సెటైర్లకు కాలం చెల్లింది. కానీ ఒక్కరు మాత్రం సీరియస్ గా పోరాడుతున్నారు. ఆయనే చంద్రబాబు. ఏపీలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వేదికగా ఈవీఎంలు వద్దు అంటూ పోరాడుతున్నారు.

ఇక జనసేన టికెట్ దక్కకముందు తన యూట్యూబ్ చానెల్ ద్వారా టీడీపీ - వైసీపీలపై యుద్ధం చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. మొన్నటి వరకు జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా విస్తృత ప్రచారంతో ఎన్నికల్లో మునిగితేలారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఫ్రీ అయ్యారు. తాజాగా మళ్లీ తన యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోను సంధించారు.

తాజాగా నాగబాబు యూట్యూబ్ వీడియోలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దఫా ఎంపీగా గెలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేస్తానని పేర్కొన్నారు. నర్సాపురం ఎంపీగా పోటీచేశానని.. ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ గెలవడం నాకు చాలా ముఖ్యమన్నారు. పాజిటివ్ ఫలితం వస్తుందన్న నాగబాబు.. ఎన్నికల సందర్భంగా ప్రజలు నాపై చూపిన ప్రేమకు నా జీవితాన్ని వాళ్లకు అంకితం చేయాలని అనిపించిందని భావోద్వేగంతో మాట్లాడారు.

ఇక తాను ఎంపీగా గెలిస్తే హద్దులు లేకుండా పనిచేస్తానని నాగబాబు ప్రజలకు హామీనిచ్చారు. ఒక ఎంపీ ఏం చేయగలడో.. ఎంత చేయగలడో చేసి చూపిస్తానని తెలిపారు. ఇలా యూట్యూబ్ లో నాగబాబు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
Tags:    

Similar News