చంద్రబాబుకు షాకింగ్ సలహా

Update: 2016-08-30 07:32 GMT
ఏపీ ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొత్త సలహా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఏం చేయాలో ఆయన చెప్పారు.  తనను ఫాలో అయితే ప్రత్యేక హోదా గ్యారంటీగా వస్తుందని ముద్రగడ చెప్పారు. చంద్రబాబు ఆమరణ దీక్ష చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన అన్నారు. సోమవారం దాసరి నారాయణరావును ఆయన కలిశారు. కాపు ఉద్యమంపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి చిరంజీవి - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - బొత్స సత్యనారాయణ - పల్లంరాజు - అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆమరణ దీక్ష చేయాలని చంద్రబాబుకు సూచన చేశారు.

సీఎంతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ - పవన్‌ కల్యాణ్  ఆమరణ దీక్ష చేస్తే తాను కూడా వారితో పాటు దీక్షకు దిగేందుకు సిద్ధమని ముద్రగడ చెప్పారు. పవన్‌ కల్యాణ్ ఉద్యమానికి కాపు ఉద్యమం పోటీ కాదని..  ప్రభుత్వం కాపులను దగా చేస్తే ఏం చేయాలన్న దానిపై దాసరి నారాయణ రావు నుంచి సలహాలు తీసుకున్నానని చెప్పారు.  కాగా వచ్చే నెల 11న రాజమండ్రిలో నిర్వహించే కాపు సంఘాల  జేఏసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాపు నేతలు నిర్ణయించుకున్నారు.

అయితే.. నిత్యం కాపుల సంక్షేమం గురించి పోరాటం చేసే ముద్రగడ నోట ప్రత్యేక హోదా మాట రావడంతో ముద్రగడ కూడా పంథా మారుస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు తనలా కుటుంబ సమేతంగా నిరాహార ఆమరణ దీక్షలు చేయాలనడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఆమరణ దీక్ష అంటే ఆత్మహత్యా నేరం కిందకు వస్తుంది.. ఆమరణ దీక్ష చేస్తే ఆత్మహత్యాయత్నం నేరం కింద అరెస్టు చేయొచ్చు.. అయితే... ఆమరణ దీక్ష చేయడం కంటే ఆమరణ దీక్ష చేయమని చెప్పడం ద్వారా ఆత్మహత్యాయత్నానికి పురికొల్పడమనేది ఇంకా తీవ్రమైన నేరమవుతుందంటూ సోషల్ మీడియాలో ముద్రగడపై సెటైర్లు పడుతున్నాయి.
Tags:    

Similar News