బాబు.. పవన్.. కాపుల నోట్లో మట్టి

Update: 2015-11-16 08:57 GMT
పవన్ కళ్యాణ్ తనకు కుల మకిలి అంటించొద్దని అంటుంటాడు కానీ.. ఆయన చుట్టూ కుల రాజకీయాల వివాదాలు మాత్రం ఆగట్లేదు. ఇటీవలే పవన్.. బాబును కలవడంపైనా ‘కులం’ యాంగిల్ ఉందంటున్నారు ప్రత్యర్థులు. కాపుల నోట్లో మట్టి కొట్టడానికే పవన్ ను చంద్రబాబు వాడుకుంటున్నాని అంటున్నాడు టీడీపీ మాజీ నేత - ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ముద్రగడ పద్మనాభం.

కాపులను బీసీల జాబితాలో చేర్చే అంశంపై చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కాడని.. ఈ హామీ విషయంలో కాపులు తీవ్ర అసంతృప్తితో ఉన్న అంశాన్ని గుర్తించి.. వ్యూహాత్మకంగా పవన్ ను పిలిపించుకుని మాట్లాడాడని.. దీని ద్వారా కాపులను చల్లబరిచే ప్రయత్నం చేశాడని  ముద్రగడ విమర్శించాడు. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి వెయ్యి కోట్లు కేటాయిస్తానన్న హామీని  కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నాడు ముద్రగడ.

కాపులను బీసీల్లోకి చేర్చే అంశంపై ఈ నెల 31న కాపుల ఐక్య గర్జన నిర్వహించనున్నట్లు ముద్రగడ వెల్లడించాడు. కాపుల విషయంలో చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముద్రగడ తెలిపాడు.
Tags:    

Similar News