అడవిని దత్తత తీసుకున్న ఎంపీ తాజాగా అలా చేశారు!

Update: 2019-08-26 04:49 GMT
వినూత్నంగా వ్యవహరించటంలో టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ముందుంటారు. మొక్కలు పెంచే దిశగా గ్రీన్ ఛాలెంజ్ ను తెర మీదకు తీసుకొచ్చి.. తరచూ హడావుడి చేసే సంతోష్.. ఈ మధ్యన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా భారీ నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే.

రాజ్యసభ సభ్యుడిగా తనకొచ్చే ఎంపీ నిధులతో కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకోనున్నట్లుగా ప్రకటించారు. దాదాపు 2,042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న సంతోష్.. మాటలకే పరిమితం కాలేదు. ఎంపీగారి నోటి వెంట దత్తత మాట రావటంతో మేడ్చల్ జిల్లా యంత్రాంగం పని చేయటం షురూ చేసింది.

కీసర అటవీప్రాంతాన్ని ఎకో టూరిజంగా మార్చేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. తానిచ్చిన హామీకి తగ్గట్లే తాజాగా అధికారులతో కలిసి అటవీ ప్రాంతాన్ని పర్యటించిన సంతోష్.. అటవీ ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. రూ.3 కోట్లతో పనులు చేపట్టేందుకు తాత్కాలిక ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు సంతోష్ ముందు పెట్టారు.

కేటీఆర్ పుట్టిన రోజున తాను చెప్పిన మాటను మాటగానే వదిలేయకుండా పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేయటం విశేషం. తాను మొదలెట్టే ఏ పనైనా సరే.. ఆపనన్న విషయాన్ని సంతోష్ చెప్పకనే చెప్పినట్లైంది. అంతా బాగుంది కానీ.. ఎంపీ లాడ్స్ తో కాకుండా సొంత డబ్బులతో ఖర్చు చేస్తే మరింత బాగుండేది కదా సంతోష్?
Tags:    

Similar News