కొత్తకోణం: మన్మోహన్‌ ఆయనను బెదిరించాడట!

Update: 2015-05-26 06:32 GMT
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను నోట్లో నాలుకలేని వ్యక్తిగా, మౌనమునిగా.. మాటలు మాట్లాడలేని వ్యక్తిగా చూస్తారంతా. ఆయన ప్రధానమంత్రి గా ఉన్న రోజుల్లోనే ఇలాంటి ఇమేజ్‌ వచ్చింది. సోనియా కనుసన్నల్లో పాలన సాగించే ఈ సర్దార్జీ ఎప్పుడూ మౌనంగానే ఉంటాడనే పేరు తెచ్చుకొన్నాడు. ప్రధానిగా మాట్లాడాల్సిన అంశాలపై కూడా స్పందించడనే చెడ్డ పేరు తెచ్చుకొన్నాడయన.

    మరి అలాంటి మన్మోహన్‌ సింగ్‌పై ఇప్పుడు ఒకింత సంచలన ఆరోపణలే వస్తున్నాయి. ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్‌ సింగ్‌ తనను బెదిరించాడని అంటున్నాడు ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ప్రదీప్‌ బైజల్‌. ప్రత్యేకించి 2జీ వ్యవహారం  గురించి బైజల్‌ స్పందించాడు. తన ఉద్యోగానుభవాలతో పుస్తకం రాసిన బైజల్‌ మన్మోహన్‌పై తీవ్ర వ్యాఖ్యానాలు చేశాడు.

    టూ జీ వ్యవహారంలో ఆ శాఖ మంత్రులు చెప్పినట్టుగా నడుచుకోకపోతే తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని మన్మోహన్‌ తనను హెచ్చరించాడని బైజల్‌ చెబుతుండటం విశేషం.

    మరి ఇన్ని రోజులూ మన్మోహన్‌ పై ఇలాంటి విమర్శలు చేసిన వారు లేరు. ఇప్పుడు ఏకంగా ఒక అధికారి తనను మన్మోహన్‌ హెచ్చరించాడు.. బెదిరించాడు.. అనే ఆరోపణలు చేస్తున్నాడు.

    మాజీ ప్రధానమంత్రికి సంబంధించి ఇది కొత్త కోణమే అనుకోవాలి. దేశ చరిత్రలోనే పెద్ద స్కామ్‌గా పేరు పొందిన వ్యవహారంలో మన్మోహన్‌ ఇలా వ్యవహరించి ఉంటే.. అది సంచలనమే అనుకోవాలి. మరి ఈ వ్యవహారం గురించి కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో.. ఈ అధికారి తన పుస్తకం సేల్స్‌ను పెంపొందించుకొనేందుకే ఇలా రాశాడా? అనేవి సందేహాలు.



Tags:    

Similar News